లాక్డౌన్లో ఇదో గుడ్ న్యూస్... కానీ అంతలోనే...
కరోనా సృష్టించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వైరస్.. అటు సంఘ జీవనంలో, ఇటు వ్యక్తిగత జీవనంలో అనేకానేక మార్పులకు దారి తీసింది. వెంటాడుతున్న వైరస్ ముప్పుతో మునుపటిలా ప్రజా రవాణా కానీ... కలిసి ప్రయాణాలు కానీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం మనలో చాలా మందిదీ ఇదే పరిస్థితి. కాబట్టే అంతా సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో తాజాగా కీలక అంశం తెరమీదకు వచ్చింది.
ప్రస్తుతం ఏది ముట్టుకుంటే ఏమవుతుందో.. ఎటు నుంచి వైరస్ తగులుకుంటుందో అన్న భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా భౌతిక దూరం తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలో ఎవరూ ప్రయాణాలకు సాహసించలేకపోతున్నారు. అందుకే చాలామంది సొంత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన తాజా సర్వేలో 74 శాతం మంది లాక్ డౌన్ తర్వాత వాహనాల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. ఇందులో 57 శాతం మంది తొలిసారిగా వాహన కొనుగోళ్లకు వెళ్తున్నవారే అవగా.. వీరంతా ప్రీ-ఓన్డ్ వాహనాలపట్ల ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రస్తుతమున్న కార్లను ఆధునికీకరించుకోవాలన్న అభిప్రాయాలూ పెద్ద ఎత్తునే వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా 1,100 మందికిపైగా ఈ సర్వేలో పాల్గొన్నారు.
అయితే, ఇదే సమయంలో ఓ ఊహించని సమస్య సైతం తెరమీదకు వచ్చింది. వాహన కొనుగోళ్లకు ఆర్థిక సమస్యలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. 26 శాతం మందికి ఇప్పుడిదే సమస్య. దీంతో వాహన కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు వారు చెప్తున్నారు. ఇక 37 శాతం మంది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో కార్లను కొనాలని ఆశ పడుతుండగా, 29 శాతం మంది సెడాన్, ఎస్యూవీలపట్ల ఇష్టం చూపిస్తున్నారు. కాగా, 56 శాతం మంది తాము కొనుగోలు చేసే వాహనాలను సొంత అవసరాలకే వినియోగిస్తామని చెప్తుండగా, 57 శాతం మంది మాత్రం క్యాబ్ సర్వీసులుగా మారుస్తామని అంటున్నారు.