రామాలయ నిర్మాణం పనులను నిలిపివేత!
దేశవ్యాప్తంగా హిందువులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి ప్రాంతంలో రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయని రామమందిర ట్రస్టు పేర్కొన్నది. ఇందుకోసం ట్రస్టు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన దర్శనాలను కూడా నిన్నటి నుంచి పునరుద్ధరించారు. అయితే నిర్మాణ పనులు పునః ప్రారంభించాలని భావించినప్పటికీ.. చైనాతో లడఖ్ విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. అయోధ్యలో రామాలయ నిర్మాణం పనులను నిలిపివేస్తున్నట్లు రామమందిర ట్రస్టు పేర్కొన్నది. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. చైనా సరిహద్దులో పరిస్థితి భీకరంగా ఉందని..ఇప్పుడు దేశాన్ని రక్షించుకోవడమే ముఖ్యమని రామమందిర ట్రస్టు పేర్కొన్నది.
గాల్వన్ లోయలో భారత, చైనా బలగాలు హింసాత్మక ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. అయితే చైనా సైనికులు తీసిన దొంగ దెబ్బకు భారత సైనికులు 20 మంది అమరులయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఆధారంగా చేసుకుని.. రామమందిర ట్రస్టు అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలనుకున్నది. ఇప్పటికే కొన్ని పూజలు జరిగాయి. ఇటీవలే అక్కడ శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు.
ప్రధాని మోదీ చేతులగా మీదుగా అధికారిక పనులు ప్రారంభం కావాల్సి ఉన్నది. దేశ ప్రజలు ఇప్పుడు చైనాపై ఆగ్రహావేశాలతో ఉన్న విషయం తెలిసిందే. దేశంలో పరిస్థితులను అంచనా వేసిన తర్వాత.. రామాలయ నిర్మాణ పనుల గురించి కొత్త తేదీని వెల్లడించనున్నట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. గాల్వన్ లోయలో అమరులైన భారత జవాన్లకు ట్రస్టు నివాళి అర్పించింది.