పాక్ క్రికెట్ టీమ్పై కరోనా పంజా !
పాక్ క్రికెట్ టీమ్పై కరోనా పంజా విసిరింది. టీమ్ టీమ్ మొత్తానికి పాజిటివ్ తేలింది. వరుసగా ఒక్కొక్కరు క్వారంటైన్ బాటపట్టారు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు జట్టు సభ్యులంతా కరోనాతో క్వారంటైన్కు వెళ్లిపోయారు.
పాక్ క్రికెట్ లోనూ కరోనా కల్లోలం రేపుతోంది. జట్టులో పదిమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొన్న ముగ్గురికి, నిన్న ఏడుగురికి కరోనా సోకింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంగ్లండ్తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం 29 మందితో జట్టును ప్రకటించింది పాక్. ఈనెల 28న ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే టీమ్లో ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన ఆటగాళ్ల సంఖ్య పదికి చేరింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్లకు కరోనా పాజిటివ్ తేలింది. ఈ ఏడుగురు ఆటగాళ్లకు లక్షణాలు లేవు. షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్ తదితరుల పరీక్షా ఫలితాలు కూడా రావాల్సి ఉంది.
అయినా సరే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించింది. పాజిటివ్గా తేలినవారిలో ఒక్క వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్ గైర్హాజరులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, మూసా ఖాన్, మొహమ్మన్ నవాజ్లను ఎంపిక చేసిన పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది. జూన్ 25న పాక్ ఆటగాళ్లకు తర్వాతి దశ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.