జగన్ నవరత్నాలకు షాక్ ?
నిజమే కదా, చేతికి ఎముక లేదు జగన్ కి అంటారు. ఆయన వరాలు ఇచ్చే వెలుపుగా ఏపీకి మారిపోయారు. అడగకుండానే అన్నీ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల సంక్షేమ రాజ్యం వచ్చిందని కూడా వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. కానీ తొలి ఏడాది గడిచేసరికి ఏపీకి 80 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు పెరిగాయని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు అంటున్నారు.
మరో వైపు జగన్ రానున్న నాలుగేళ్ల కాలానికి నవరత్నాలు కింద పధకాలు అమలు చేయడం కష్టమని మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంటున్నారు. ఇక ఇపుడు మరో ఎంపీ, రాజకీయ పరిశీలకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే ప్రశ్న వేస్తున్నారు. జగన్ అన్ని పధకాలు ప్రకటించారు. బాగానే ఉంది కానీ నిధులు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు.
కొత్త బడ్జెట్లో 84 వేల కోట్ల రూపాయలు కేవలం నవరత్నాలు సంక్షేమ పధకాల కోసం కేటాయించారు. కానీ వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో బడ్జెట్లో చెప్పలేదని ఉండవల్లి అంటున్నారు. ఏపీకి ఇపుడున్న పరిస్థితుల్లో కొత్త అప్పులు పుట్టవని కూడా ఉండవల్లి చెప్పేస్తున్నారు.
మరో వైపు చూస్తే కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వదని, కరోనా వైరస్ తరువాత ప్రపంచమే కుదేల్ అయిందని, ఈ నేపధ్యంలో చూసుకున్నపుడు ఏపీ ఖజానాకు నిధులు ఎలా వస్తాయని ఉండవల్లి అంటున్నారు. ఈ విషయంలో ప్రజలకు జగన్ సర్కార్ వివరణ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. జగన్ సర్కార్ అసత్యాలు ప్రచారం చేయకూడదని కూడా ఉండవల్లి అంటున్నారు.
నిజానికి ఏపీకి ఇపుడు చూస్తే పుట్టెడు అప్పులు ఉన్నాయి. విభజన ఏపీ 90 వేల కోట్ల రూపాయల అప్పులతో వచ్చింది. ఆ తరువాత చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇపుడు జగన్ సర్కార్ తొలి ఏడాది అప్పులే చేసిందని టీడీపీ నేతలు అంటున్నారు. కరోనా గడ్డు రోజుల్లో ఇపుడు ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. దాంతో నవరత్నాలకు భారీ షాక్ తప్పదని అంటున్నారు.