చర్చలు జరపండి...భారత్, చైనా సరిహద్దు వివాదంపై బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే...?!
భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం రోజురోజుకు జఠిలం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనా యుద్ధన్మోదంతో వ్యవహరిస్తోంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను అటు ఐరోపా, ఆసియా దేశాలు ఎంతో నిశితంగా పరిశీలిస్తున్నాయి. రెండు దేశాలతో సుధీర్ఘకాలంగా వాణిజ్య,రక్షణ సంబంధాలను కలిగి ఉన్న నేపథ్యంలో రెండు దేశాలు తీసుకోబోయే నిర్ణయాలు ఏవిధంగా ఉండబోతున్నాయి..అందులో మన పాత్ర ఎలా ఉండాలనే విషయాలపై సమాలోచనలు సాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ -చైనా సరిహద్దు వివాదం..పాకిస్థాన్ అతిపై తిట్టిపోసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు.
గాల్వన్ ఘటన పట్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ తొలిసారి ప్రకటన చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు చర్చలు చేపట్టాలని ఆయన రెండు దేశాలను కోరారు. లడఖ్లో పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హౌజ్ ఆఫ్ కామన్స్లో జరిగే పీఎం క్వశ్చన్స్ చర్చలో ఆయన ఈ ప్రకటన చేశారు. భారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలపై ప్రధాని స్పందించాలని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఫ్లిక్ డ్రుమ్మాండ్ కోరడంతో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. గల్వాన్ లోయలో వారం క్రితం భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. రెట్టింపు సంఖ్యలో శత్రుదేశ సైనికులను హతమార్చారు.
ఆ తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు రెండు దేశాలు సైనిక, దౌత్య పరమైన చర్చలు జరుపుతున్నప్పటికీ డ్రాగన్ ద్వంద్వ నీతికి పాల్పడుతోంది. ఒక పక్క శాంతి, శాంతి అంటూనే సరిహద్దుల్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించింది. తొలుత తప్పు చేసింది భారతేనని బుకాయిస్తోంది.గతంలో జరిగిన ఒప్పందాల మేరకు వెనక్కు తగ్గుతామని బుధవారం భారత్, చైనా ప్రకటించినప్పటికీ మరోసారి గల్వాన్లో డ్రాగన్ బలగాలు భారీగా తిష్ట వేశాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. భారత్ సైతం భారీ స్థాయిలో బలగాలను, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను అక్కడ మోహరించింది.