అత్యాచారానికి గురయ్యానంటూ కేసు వేసిన ఓ యువతిపై కర్ణాటక హైకోర్టు సీరియస్..?
ఈ మద్య కొంత మంది మానవమృగాలు ఆడవారు కనిపిస్తే చాలు అత్యాచారాలకు ఎగబడుతున్నారు. చిన్నా.. పెద్ద అనే వయసు తేడా లేకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. అలాంటిది ఓ యువతి తనపై అత్యాచారం జరిగిందన్న విషయంపై కాంట్రవర్సీ నెలకొంది. అత్యాచారం కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. కర్ణాటక హైకోర్టు ఫిర్యాదు చేసిన యువతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.. తనపై అత్యాచారం జరిగిన తర్వాత.. తాను అలసిపోయి నిద్రపోయానని బాధితురాలు చెప్పడం దారుణమని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఇది భారత మహిళ స్వభావం కాదని పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే... తన సహోద్యోగి తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె కేసు పెట్టింది.
ఈ నేపథ్యంలో, ముందస్తు బెయిల్ కోసం నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా కేసు పెట్టిన యువతిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనపై ఆఫీసులోనే అత్యాచారం జరిగింది.. సహోద్యోగియే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేయగా.. పిటిషన్పై విచారణ సందర్భంగా.. పలు అనుమానాలను వ్యక్తం చేసింది కోర్టు.. బాధితురాలు రాత్రి 11 గంటలకు ఆఫీసుకు వెళ్లడం, నిందితుడితో కలిసి మద్యం సేవించడం.. రాత్రంతా అక్కడే ఉండడం లాంటి చర్యలు కొత్త ప్రశ్నలకు తావిస్తోందన్న హైకోర్టు.. ఈ విషయంలో ఆమె చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని అభిప్రాయపడింది.
కాగా, రాత్రి 11 గంటలకు ఆమె తన కార్యాలయానికి ఎందుకు వెళ్ళారనే దానిపై ఫిర్యాదులో ప్రస్తావించలేదు.. పిటిషనర్తో మద్యం తీసుకోవడం, ఉదయం వరకు తనతో ఉండడంపై కూడా ఆమె అభ్యంతరం చెప్పలేదు... కానీ. అత్యాచారం జరిగిన తర్వాత అలసిపోయి నిద్రలోకి జారుకున్నానని చెప్పడం ఏంటి? అని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. రాజీ కుదిరితే ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని బాధితురాలు రాసిన లేఖను ప్రస్తావించింది. లైంగిక ప్రయోజనాల కోసం ఆమెపై నిందితుడు ఒత్తిడి తెచ్చినప్పుడే.. ఎందుకు కోర్టును సంప్రదించలేదని ప్రశ్నించింది.. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే.. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదని షరతులు విధించింది.