ఇంట్లో ఒక్కరికే...లాక్ డౌన్ కొత్తరూల్స్ తెలిస్తే షాకే
ప్రపంచానికి కరోనా అంటించిన చైనాకు ఊహించని షాక్లు తగులుతున్నాయి. గతంలో ఆ దేశంలో కరోనా కలకలం కొనసాగి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది నుంచే కరోనా కేసులు చైనాలో విజృంభిస్తున్నా.. ఇప్పుడు రెండవ దఫా కేసులు నమోదు అవుతున్న తీరు చైనా పాలకులకు షాక్ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్ సమీప జిల్లాలో కఠిన లాక్డౌన్ విధించారు.
కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడంతో హెబే ప్రావిన్సులోని అనక్సిన్ కౌంటీలో ఆంక్షలను కఠినతరం చేశారు. ఇంటి సభ్యుల్లో ఒక్కరు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఫుడ్, మెడిసిన్ కొనుగోలు చేసేందుకు మాత్రమే ఆ అవకాశం ఇస్తున్నారు. ఇలా సుమారు 4 లక్షల మందిని దాదాపు కట్టడి చేశారు. అనక్సిన్ జిల్లా .. బీజింగ్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రెండో దఫా వ్యాప్తిలో ఆ జిల్లాలో తాజాగా 18 కేసులు బయటపడ్డాయి. కేవలం అత్యవసర సర్వీసుల వారికి మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. నాన్ రెసిడెంట్స్కు గ్రామాల్లోకి అనుమతి ఇవ్వడంలేదు. నియమావళిని ఉల్లంఘించిన వారిని పోలీసులు శిక్షిస్తారని వార్నింగ్ ఇచ్చారు. అనక్సిన్ జిల్లాను పూర్తిగా కట్టడి చేసి వైరస్ను అదుపులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు.
ఇదిలాఉండగా, మనదేశానికి సంబంధించిన కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. దేశంలో రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా సగటున అంతకుమించే పెరుగుతుండటంతో రికవరీ రేటు క్రమంగా మెరుగుపడుతున్నది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా 5,48,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 3,21,723 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల కంటే రికవరీ అయిన వారి సంఖ్య 1,11,602 ఎక్కువగా ఉండటంతో దేశంలో రికవరీ రేటు మెరుగుపడి 58.67 శాతానికి చేరింది.