చైనా దారికి వస్తోందిగా...ఈ సోయి ముందు ఉండాల్సింది
దిమ్మతిరిగే షాకులు తగిలిన నేపథ్యంలో తిక్క చైనా దారికి వస్తోంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత నేపథ్యంలో చైనాకు చెందిన, ఆ దేశంతో సంబంధమున్న 59 యాప్లను భారత్ నిషేధించడం తెలిసిన సంగతే. సోమవారం భారత ప్రభుత్వం ఈ యాప్లను నిషేధించగా ఆ మరుసటి రోజే 59 చైనా యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ సంస్థ మంగళవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో చైనా దేశం ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగంగానే తన బాధను వ్యక్తం చేసింది.
తూర్పు లఢక్ సరిహద్దులో ఈ నెల 15న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులైన తర్వాత దేశంలో చైనాపై ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ చైనాకు సంబంధించిన 59 యాప్లపై భారత్ సోమవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్టాక్తో సహా హలో, లైకీ, యూసీ బ్రౌజర్, కామ్స్కానర్, విగొ వీడియో, వంటి పలు యాప్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమయంలోనే చైనా తన ఆందోళనను వ్యక్తం చేసింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మన దేశానికి చెందిన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్ణయం పట్ల చైనా తీవ్రంగా ఆందోళన చెందుతున్నది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. `అంతర్జాతీయ, స్థానిక చట్టాల నిబంధనలకు కట్టుబడి ఉండాలని చైనా వ్యాపారులకు తమ ప్రభుత్వం చెబుతుంది. చైనాతో సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను సమర్థించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉన్నది’ అని లిజియాన్ చెప్పినట్లు పేర్కొంది. కాగా, చైనా ముందే సరైన దౌత్య విధానం అవలంభిస్తే ఈ సమస్యే ఉండేది కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.