ఈ గోల్డెన్ డేస్ లో బాండ్లకు డిమాండ్ ఉంటుందా.. ?
మదుపరులకు ముఖ్య గమనిక. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మరోసారి బంగారం బాండ్ల జారీ ప్రక్రియ మొదలైంది. గోల్డ్ బాండ్ సబ్ స్క్రిప్షన్ పదోతేదీన ముగుస్తుంది. అయితే పెట్టుబడికి ఇది మంచి అవకాశమనేది మార్కెట్ నిపుణుల మాట.
కనకం ధగధగలాడుతోంది. పైపైకి ఎగబాకుతోంది. సామాన్యులకు అందబోనంటూ ఊరిస్తోంది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 50 వేల మార్కు దాటి ఎగబాకుతోంది. లాక్ డౌన్తో ఆర్థికవ్యవస్థలు కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు గోల్డ్నే ఎక్కువగా నమ్ముకున్నారు.
దీంతో బంగారం ధర పెరిగిపోతోంది. 2019 ఆగస్టులో తొలిసారిగా 40 వేలు దాటిన పదిగ్రాముల బంగారం ధర.. పదకొండు నెలల్లోనే పదివేల రూపాయలు పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరోసారి బంగారం బాండ్ల జారీ నేటి నుంచి నుంచి ప్రారంభమైంది. ఈ సారి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు 4 వేల 852 రూపాయలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఖరారు చేసింది. ఈ రోజు ప్రారంభమైన బాండ్ల సబ్ స్క్రిప్షన్ 10వ తేదీ వరకు జరుగుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆరు విడతల్లో సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా సబ్ స్క్రిప్షన్ చేసుకుని డిజిటల్ చెల్లింపులు చేపట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు.. గ్రాముకు 50 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అంటే వీరికి 4 వేల 802 రూపాయలకే గ్రాము బంగారం లభించనుంది.
అయితే గత నెల 8 నుంచి 12 మధ్య జారీ చేసిన బంగారం బాండ్ల ధర గ్రాముకు 4 వేల 677 రూపాయలుండగా... ఈసారి 4 వేల 852కి చేరింది. ప్రస్తుతం గోల్డెన్ డేస్ నడుస్తుండడంతో బాండ్లకు డిమాండ్ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.