సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఎందుకంత దాపరికం...లేదంటే ఆ ఎత్తుగడేనా..?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడా అంటూ మంగళవారం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్తో పాటు రాష్ట్ర ప్రజానీకంలో కేసీఆర్ ఆరోగ్యంపై తీవ్ర చర్చ మొదలైంది. వాస్తవానికి కేసీఆర్కు ఆరోగ్యం బాగోలేదని ఎవరూ ఎక్కడ ప్రస్తావించడం గాని, ప్రకటించడం గాని చేయలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్లో కొద్దిమందికి కరోనా పాజిటివ్గా రావడంతో ముఖ్యమంత్రి తన ఫాం హౌస్లో హోం క్వారంటైన్ తీసుకోవడానికి వెళ్లినట్లుగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు సోషల్ మీడియాలో అటు కొన్ని పత్రికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాస్పదాలు వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించడం గమనార్హం.
అయితే ప్రచారం జరుగుతున్నా..దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన టీఆర్ ఎస్ ముఖ్యులు నోరు మెదపకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు విషయం అది కాదని, సచివాలయం కూల్చివేత అంశం మీడియాలో ఫోకస్ కాకుండా..జనంలో చర్చ జరగకుండా చేసేందుకే టీఆర్ ఎస్ అధినేత ఈ ఎత్తుగడను అవలంభిస్తున్నారంటూ చర్చ లేవనెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ పత్రిక అయితే ఓ అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా అంటూ క్వశ్చన్ మార్కుతో కథనాన్ని ప్రచురించింది. అయితే ఎలాంటి ఆధారాల్లేకుండా కథనం ప్రచురించడంపై సదరు పత్రిక యాజమాన్యంపై టీఆర్ ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం గమనార్హం.
తాజాగా మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారో, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరుతో హైకోర్టులో నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్కు వెళ్ళిపోయారంటూ పత్రికల్లో, టీవీ ఛానెళ్ళలో వార్తలు వచ్చాయని, చాలా మంది ప్రజలు సీఎం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.