ఇది వార్త అంటే...కరోనాకు మళ్లీ మనమే దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాం
కరోనా వ్యాక్సిన్. ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్ద, ధనిక, పేద అనే దేశం లేకుండా అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. కోవిడ్19పై ఇప్పటికే ఫార్మా కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయిన తరుణంలో..వాటి ఫలితం ఎప్పుడు వస్తుందనే విషయంలో ప్రజలంతా కళ్లు కాయలు కాసేలా నిరీక్షణలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటికే మనదేశం నుంచి వ్యాక్సిన్ వచ్చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఇంకో సంచలన వార్త తెరమీదకు వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా మనతో జట్టుకట్టి కరోనా మహమ్మారి నివారణ కోసం ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేందుకు సిద్ధం అయింది. వాషింగ్టన్లో ఉన్న భారతీయ అంబాసిడర్ తరణ్జిత్ సింగ్ సంధూ ఈ మేరకు కీలక విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం భారత్, అమెరికా మధ్య మూడు ప్రాజెక్టులు నడుస్తున్నట్లు తరన్జిత్ సింగ్ సంధూ చెప్పారు. ప్రస్తుతం కీలకమైన కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేసేందుకు సంయుక్తంగా పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ చికిత్స కోసం ఆయుర్వే ఔషధాన్ని తయారు చేసేందుకు రెండు దేశాల పరిశోధకులు జాయింట్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సంధూ తెలిపారు. ఆయుర్వేద రంగానికి చెందిన శాస్త్రవేత్తలు తమ జ్ఞానాన్ని, పరిశోధనా అంశాలను పంచుకున్నట్లు సంధూ చెప్పారు. రెండు దేశాలకు చెందిన ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు.. సంయుక్తంగా కోవిడ్ చికిత్స కోసం ట్రయల్స్ నిర్వహించనున్నారని అమెరికాలో భారత రాయబారి ప్రకటించారు.
దీంతో పాటుగా రెండు దేశాలకు ముఖ్యమైన అంశాలను భారతీయ అంబాసిడర్ తరణ్జిత్ సింగ్ సంధూ వెల్లడించారు. అమెరికా-భారత దేశాలు వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్(వీఏపీ) కింద రోటోవాక్ వ్యాక్సిన్ తయారు చేసినట్లు సంధూ తెలిపారు. తక్కువ ధర మందులను, వ్యాక్సిన్లను తయారు చేయడంలో భారతీయ ఫార్మా కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఇప్పుడు కూడా భారతీయ కంపెనీలు మహమ్మారి నివారణలో కీలక పాత్ర పోషించనున్నట్లు సంధూ తెలిపారు. పిల్లల్లో డయేరియాకు కారణమైన రోటా వైరస్ నిర్మూలనలో ఆ డ్రగ్ కీలకంగా మారిందని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ సంస్థ ఆ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసిందన్నారు. వీఏపీ ప్రాజెక్టు కింద టీవీ, ఇన్ఫ్లూయాంజా, చికున్గునియా వ్యాధులకు కూడా వ్యాక్సిన్ అభివృద్ధి జరుగుతున్నట్లు తెలిపారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో భారతదేశం మరోమారు ఆయుర్వేదం రూపంలో తన సత్తా చాటడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.