జగనన్న తోడు పథకం అమలుతో చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చనున్న జగన్ సర్కార్... వడ్డీ వ్యాపారులకు షాక్...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఏపీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో జగన్ పథకాలను అమలు చేస్తున్న తీరు ఇతర రాష్ట్రాల సీఎంలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేసిన జగన్ మిగిలిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.
కరోనా కష్టకాలంలో జగన్ సర్కార్ రైతు భరోసా, కాపు నేస్తం, వాహన మిత్ర ఇతర పథకాలను అమలు చేసింది. ఆగష్టు 15వ తేదీన 30 లక్షల ఇళ్ల పట్టాలను ఇళ్లు లేని ప్రజలకు పంపిణీ చేయనుంది. జగన్ సర్కార్ త్వరలో జగనన్న తోడు పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నెల 16వ తేదీతో ఈ పథకానికి సర్వే ముగియనుంది.
జులై 23వ తేదీన ప్రభుత్వం అర్హుల జాబితాను ప్రకటించనుంది. తోపుడుబండ్లు, ఫుట్ పాత్ లపై వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి పదివేల రూపాయల చొప్పున రుణం మంజూరు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
18 ఏళ్ల వయస్సు దాటి.... పట్టణాల్లో అయితే రూ. 12 వేల లోపు, గ్రామాల్లో అయితే రూ. 10 వేల లోపు నెలవారీ ఆదాయం కలిగి ఉండి.... మాగాణి 3 ఎకరాల లోపు, మెట్టభూములు 10 ఎకరాలు... మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు చిరువ్యాపారుల నుంచి రోజుకు 100 రూపాయలకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అలాంటి వడ్డీ వ్యాపారులకు సీఎం జగన్ ఈ పథకం అమలుతో షాక్ ఇస్తున్నారు.