ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అత్యాశకు వెళ్తున్నాడా ?
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాలో ఫేమస్ అయిన నటుడు పృథ్వీరాజ్ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని, రాజకీయంగా పైకి ఎదగాలని చూశారు. ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్రలోనూ పాల్గొని జగన్ దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారు. అప్పటికే చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు జగన్ వెంట నడిచినా, వారు పృథ్వి కంటే తక్కువే గుర్తింపు తెచ్చేకున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మిగతా వారి విషయాన్ని పక్కన పెట్టి, పృథ్వి రాజ్ ప్రతిష్టాత్మకమైన ఎస్వీ బీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ పదవిని పదిలంగా కాపాడుకోవడం మానేసి, వివిధ ఆరోపణలతో మూడునాళ్ళ ముచ్చట గానే చేసుకున్నారు. చివరికి ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇక అప్పటి నుంచి వైసీపీలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా అయిపోయారు. ఆయన సంగతి ఇక ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో, మళ్ళీ నరసాపురం ఉపఎన్నికల పేరుతో తెరపైకి వచ్చారు. పార్టీ అధిష్టానం పై అసమ్మతి జెండా ఎగరవేసిన రఘురామకృష్ణంరాజు వైసీపీ అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తుండటంతో, అక్కడ కనుక ఉప ఎన్నికలు వస్తే నరసాపురం వైసిపి పార్లమెంట్ అభ్యర్థిగా తాను రంగంలో దిగుతాను అనే విషయాన్ని ఇప్పుడు ఆయన చెబుతున్నారు. అవకాశం ఉంటే ఆ సీటు నాకు ఇవ్వమని జగన్ ను అడుగుతాను అంటూ ఆయన చెబుతున్నారు.
నరసాపురం లో ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం తనకు ఉందని చెబుతున్నారు. కానీ ఆయనపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, నిజంగానే నరసాపురం ఉపఎన్నికలు వస్తే, ఆయనకు సీటు ఇచ్చే అవకాశం ఉందా అనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతుండగా, ఒకవేళ నిజంగా అక్కడ ఎన్నికలు వస్తే, బిజెపి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజు ను రంగంలోకి దింపితే గెలుపు సులభమవుతుందని, రఘురామకృష్ణంరాజు కు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.