ఆక్సిజన్ లేక ప్రాణాలు విలవిల !
కరోనా రోగులకు చికిత్స అందించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్తోంది సర్కార్. కానీ అత్యవసర రోగులకు ఆక్సిజన్ మాత్రం అందడం లేదు. తెలంగాణలో కరోనా ఉధృతి ఆగడం లేదు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయ్. ఒక్క హైదరాబాద్లోనే 80 శాతానికి పైగా నమోదవుతున్నాయ్. అయితే కరోనా వచ్చినా.. లక్షణాలు లేని వాళ్లను హోం ఐసోలేషన్లో పెడుతున్నారు. ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్లలో లక్షణాలు కన్పించినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆస్పత్రులకు రావాలని చెబుతోంది సర్కార్. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గాంధీతో పాటు మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందటం లేదు. ఇప్పటికే ఎందరో రోగులు తమ ప్రాణాలు పోయే ముందు తీసిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణాలో తొలి కరోనా కేసు మార్చి2 న నమోదయింది. అప్పటి నుంచి కరోనా కట్టడి కోసం వైద్యశాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి వారికి సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. దీంతో గాంధీ, ఉస్మానియా, చెస్ట్, కింగ్ కోఠి, ఫీవర్ ఆస్పత్రుల్లో యుద్ద ప్రాతిపదికన ఆక్సిజన్ లైన్స్ వేయించారు. గతంలో కొన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల మాత్రమే వాడే వారు. అయితే, ఇప్పుడు పెద్ద పెద్ద రియాక్టర్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ లైన్ పెట్టించారు.
ఆక్సిజన్ లైన్స్ ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలైన తలనొప్పి మొదలైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న టెక్నిషియన్లకు, నర్సులకు లైన్స్ మెయింటైన్ చేయడం సరిగ్గా రాదు. వీరందరికీ మెయింటెన్స్ కొత్త. అంతే కాదు ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే సరిచేసే వాళ్లు కూడా లేరు. దీంతో ఆస్పత్రులో కావాల్సినంత ఆక్సిజన్ ఉన్నా.. ప్రాణాపాయంలో ఉన్న వాళ్లకు అది అందడం లేదు. మొత్తానికి అన్నీ ఉన్నా మెయింటైన్స్ లేక కరోనా రోగులు ప్రాణాలు వదులుతున్నారు.