రేవంత్ రెడ్డి మొదలెట్టాడు... ఇప్పుడు అంతా ఫాలో అవుతున్నారు...?
తెలంగాణ సీఎం కేసీఆర్ రూటే సెపరేటు.. అంతా నా ఇష్టం అన్నట్టు ఉంటుంది ఆయన పాలనాతీరు.. తెలంగాణలో ఇప్పుడు అంతా ఆయన హవా నడుస్తోంది. ఏం చేసినా దాన్ని సమర్థించుకునే రాజకీయ చాణక్యం కేసీఆర్ ది. అందుకే ఆయన పెద్దగా విమర్శలను లెక్క చేయరు. తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్తుంటారు. ఒక్కోసారి అది అప్రజాస్వామ్యంగానూ కనిపిస్తుంది.
తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత వ్యవహారం కూడా అలాగే మారింది. ఈ కూల్చివేతల్లో రహస్యం ఎందుకంటూ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గళమెత్తారు. సచివాలయం కింద నిజాం కాలం నాటి నిధులు ఉన్నాయని ప్రచారం ఉందని.. వాటి కోసమే కేసీఆర్ సర్కారు సచివాలయం కూల్చివేతలో గోప్యత పాటిస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల్లో వాస్తవం ఎంతో తెలియదు. కానీ ఈ విమర్శల వల్లకేసీఆర్ సర్కారు పాటిస్తున్న గోప్యతపై అందరి దృష్టీ మళ్లింది.
ఇప్పుడు మిగిలిన పార్టీల నాయకులు కూడా రేవంత్ రెడ్డి వెలుగులోకి తెచ్చిన అంశంపై ఫోకస్ చేస్తున్నారు. సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అదే పాట పాడుతున్నారు. సెక్రటేరియెట్ లోని పాత బ్లాకుల కింద గుప్త నిధులు ఉన్నాయని అందరూ అంటున్నారని, వీటిని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు దోచుకునేందుకే రహస్యంగా కూల్చి వేస్తున్నారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.
గతంలో ఏ కట్టడాలు కూల్చి వేసినా మీడియాను, ఇతర పార్టీ నేతలను అనుమతించే వారని, గుప్త నిధులు దోచుకునేందుకే పోలీసు సెక్యూరిటీ పెట్టి కూల్చి వేస్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు. అంటే రేవంత్ రెడ్డి విమర్శలను వీరంతా ఫాలో అవుతున్నట్టేగా...!?