తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. ఆ సంఖ్య బాగా పెరిగిందట..!?
కరోనా కట్టడి విషయంలో ఇటీల తెలంగాణ సర్కారు అంతగా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు బాగా వచ్చాయి. కరోనా వచ్చిన మొదట్లో బాగా హడావిడి చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కనీసం మీడియా ముందుకు కూడా రాకపోవడం కూడా ఈ విమర్శలకు బలమిచ్చింది. అంతే కాదు.. దేశంలోనే అతి తక్కువగా కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం అంటూ విపక్షాలు విమర్శల డోసు పెంచాయి.
వాస్తవానికి కూడా తెలంగాణలో మొదటి నుంచి కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పక్కనే ఉన్న ఆంధ్రాలో పరీక్షల విషయంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలోనూ టెస్టుల సంఖ్య పెరుగుతోందట. తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచామని మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయడంలో ఆలస్యమయిందని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచామని తెలిపారు.
ఐసీఎంఆర్ సూచనల మేరకు ఈ టెస్టులు పెంచడం జరిగిందట. అంతే కాదు.. తెలంగాణలో కరోనా వైరస్కు తోడు సీజన్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఈటల అంటున్నారు. 81 శాతం మందికి కూడా ఈ వైరస్ సోకినట్టు కూడా తెలియదని ఆయన అంటున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలకు మించదని ఈటల చెబుతున్నారు.
కరోనా తీవ్రత ఉండి ఆసుపత్రికి వెళ్లినప్పుడే ఖర్చవుతుందట. లక్షణాలు లేని వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కరోనా లక్షణాలున్నవారిని ప్రభుత్వ ఐసోలేషన్కు తరలించాలని మంత్రి తెలిపారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కారు చిత్తశుద్ధితో ఉందంటున్నారు ఈటల.