పవన్ కళ్యాణ్ మాటలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులు..?
మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుండి ఆమోదం లభించడంతో... ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం పూర్తిస్థాయిలో మారబోతుంది. ఢిల్లీ, ముంబై లాగా విశాఖపట్నాన్ని మారుస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో విశాఖపట్నం ప్రజలు తెగ సంతోష పడిపోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానుల విధానంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. విశాఖకు రాజధాని అవసరం లేదంటూ వ్యతిరేక స్టాండ్ ని పవన్ కళ్యాణ్ తీసుకుంటుండటంతో... రేపొద్దున ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతావ్ అంటూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు.
నిజానికి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు... విశాఖపట్నం చిరంజీవికి మూడు సీట్లు ప్రసాదించింది. మెగా హీరోల సినిమాలను కూడా విశాఖపట్నం ప్రాంత ప్రజలు బాగా ఆదరిస్తుంటారు. అటువంటి విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీకే హాని తల పెడుతున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న జనసేన పార్టీ చాలాకాలం మనుగడ సాగించాలంటే అందరి ప్రజల మద్దతు కావాలి. కాని పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖపట్నం ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వారి మద్దతును పూర్తిస్థాయిలో కోల్పోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ దుందుడుకు వైఖరిపై జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.