అరాచకం: ప్రొ. నాగేశ్వర్ను చంపుతామంటూ కాల్స్? - ఇదే అసలు కారణం..?
ఆయన కొన్నేళ్లుగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అందుకే తెలుగు రాజకీయాల మొదలు అంతర్జాతీయ అంశాల వరకూ ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఇటీవల ఆయనకు ఓ వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత నెల 25న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి నాగేశ్వర్కు వరుసగా ఫోన్స్ వచ్చాయి. మొదట సెల్ ఫోన్ నుంచి .. ఆ తర్వాత ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ కాల్ నుంచి కాల్ చేసి చంపేస్తామని బెదిరించారట. ఈ మేరకు ఆయన గత నెల 25నే హాక్ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యూట్యూబ్లో ఆయన చేసిన విశ్లేషణలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై కె. నాగేశ్వర్ ఇలా అన్నారు. ‘‘గత 25న నన్ను చంపుతానని అగంతకుడు ఫోన్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నానని దూషించాడు. ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ వారు అందుబాటులోకి రాలేదు. 12 రోజులైనా ఫిర్యాదు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సామాన్యుల ఫిర్యాదుల సంగతేంటి? ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తా ’’ అని కె. నాగేశ్వర్ స్పష్టం చేశారు.
నిజాలను నిర్భయంగా విశ్లేషించడం నాగేశ్వర్కు అలవాటు. ఆయన ఎవరు తప్పు చేసినా వారిది తప్పు అని నిక్కచ్చిగా చెబుతారు. ఆయన విమర్శలకు గురైన వారిలో అన్ని పార్టీల వారూ ఉన్నారు. కానీ ఏ పార్టీని విమర్శిస్తే వారు.. నాగేశ్వర్ పై కోపం పెంచుకోవడం కాక ఆ విమర్శలో అంశంపై దృష్టి సారిస్తే మంచిది.