ఆయన రాజీనామా.. ప్రధాని మోడీ కి ఆవేదన మిగిల్చింది..?
జపాన్ ప్రధాని షింజో అబే ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్ళ షింజో అబే అనారోగ్యంతో బాధ పడుతున్నారు.. తన అనారోగ్యం అధికారిక కార్యకలాపాలకు అడ్డంకి కాకూడదు అన్న ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పదవి కాలం పూర్తి కాకముందే రాజీనామా చేస్తున్నందుకు దేశ ప్రజలందరికీ క్షమాపణలు కోరారు జపాన్ ప్రధాని షింజో అబే. తన స్థానంలో మరో వ్యక్తి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేంతవరకు... ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతాను అంటూ స్పష్టం చేశారు.
అయితే జపాన్ ప్రధాని రాజీనామా తో భారత ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జపాన్ ప్రధాని షింజో అబే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్-జపాన్ మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగిన విషయం తెలిసిందే. 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉన్న జపాన్ ప్రధాని షింజో అబే భారత్ పై అమితమైన ప్రేమ చూపించే వారు. అంతేకాకుండా ఇంకొన్ని రోజుల్లో జపాన్ భారత్ మధ్య రక్షణ పరమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా చేయడంతో రాబోయే రోజుల్లో భారత్-జపాన్ మధ్య సత్సంబంధాలు అయోమయం లో పడిపోయాయి. కొత్త ప్రధానిగా ఎవరు వస్తారో వారు భారత్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో అన్నది ప్రస్తుతం భారత ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసింది.