బీజేపీకి జనసేన దూరమేనా ? పవన్ కు ఎందుకు నచ్చడంలేదు ?

ఉమ్మడిగా 2024 ఎన్నికల నాటికి బలం పుంజుకుని, ఏపీలో జెండాలు పాతాలనే లక్ష్యంతో బిజెపి, జనసేన పార్టీలు  ముందుకు కదులుతున్నాయి. రెండు పార్టీల సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు వేరైనా, అధికారం కోసం ఒకరికొకరు త్యాగం చేసుకొని, పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. కానీ బిజెపి జనసేనతో పొత్తు పెట్టుకున్న మొదటి నుంచీ ఆ పార్టీని పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తూ వస్తోంది. ఏపీకి సంబంధించి ఏ నిర్ణయం అయినా, ఉమ్మడిగా చర్చించి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉన్నా, బీజేపీ మాత్రం జనసేన ను పరిగణలోకి తీసుకోకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. మొదటి నుంచి ఇదే పరిస్థితి ఉన్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీటిని పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.


 కానీ బిజెపి వైఖరి కారణంగా జనసేన జనాల్లో అభాసుపాలవుతోంది అనే అభిప్రాయంతో కొంతకాలంగా బిజెపి పై ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా అమరావతి విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉమ్మడిగా పోరాటాలు ఆందోళన నిర్వహించారు. కానీ కొత్తగా బీజేపీ ఏపీ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు ఎక్కడా జనసేనను కలుపుకు వెళ్లకుండా దూరం పెడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఆయనే సొంతంగా తీసుకుంటూ వస్తున్నారు.

తాజాగా కేంద్రం సైతం అమరావతి విషయంలో తాము కలుగ చేసుకోమని, పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఇష్టం అని తేల్చి చెప్పడంతో పవన్ బిజెపి పై తీవ్ర అసహనంతో ఉన్నారట. కనీసం తమకు మాట వరసకైనా ఈ విషయం చెప్పకుండా, నేరుగా ప్రకటనలు చేయడం తమను అవమానించడమేననే అభిప్రాయంలో ఉన్నారు. అందుకే బీజేపీ కి సంబంధం లేకుండానే పవన్ కి మద్దతుగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాను చివరి వరకు అమరావతి ప్రాంత రైతుల కోసం పోరాడుతానని వారికి మద్దతుగా నిలబడతాను అంటూ ప్రకటనలు చేస్తున్నారు.

 ఇది ఖచ్చితంగా బీజేపీకి ఆగ్రహం తెప్పించే అంశమే. అయినా పవన్ బిజెపి తో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపైన ప్రజా సమస్యల విషయంలో తామే కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. బీజేపీ జనసేనతో పొత్తు ఉన్నా, పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తుండడంతో, తాము కూడా అదే విధంగా వ్యవహరించాలని, జనసేనకు  అభిమానులు, సామాజికవర్గం అండదండలు ఉన్నాయని, ఏపీలో బీజేపీ జెండా పాఠాలు అంటే ఖచ్చితంగా తమ అవసరం బీజేపీకి ఉంటుందనే అభిప్రాయం పవన్ ఉన్నారట. అందుకే ఇకపై బిజెపిని పట్టించుకోనట్టు గానే సొంత అజెండాతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: