నౌకలతో రౌండప్ చేసిన ఇండియా.. అసలు విషయం అదీ..!

NAGARJUNA NAKKA
చైనా విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా, దూకుడుగా వ్యవహరిస్తోంది. గాల్వన్ లోయలో చైనా మొండిగానే వ్యవహరిస్తోంది. ఇరు దేశాలు వెనక్కి వెళ్లాలని చెప్పిన చైనా.. ఆ మాటకు కట్టుబడలేదు. దీంతో భారత్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోకి భారత అగ్రశ్రేణి నౌకల్ని మోహరించింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బీజింగ్ నాయకత్వం. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు అనేక దేశాలతో వివాదం ఉంది. అక్కడి సహజ వనరులపై కన్నేసిన డ్రాగన్‌.. ఆ సాగరంలో మెజార్టీ భాగం తనదేనంటోంది.  అక్కడ కృత్రిమంగా దీవుల్ని ఏర్పాటు చేస్తోంది. సమీపంలోని దేశాలన్నీ చైనా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

2009 నుంచి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ సైన్యాన్ని, నౌకల్ని భారీగా మోహరిస్తూ వస్తోంది. గల్వాన్‌ ఘర్షణ జరిగిన వెంటనే భారత్‌.. దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపినట్లు నౌకాదళం తెలిపింది. ఈ చర్య ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందని వివరించాయి. భారత్‌తో జరిగిన దౌత్య చర్చల్లో ఈ అంశాన్ని  చైనా విదేశాంగ ప్రతినిధులు ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. భారత్ నౌకల్ని పంపించడంపై చైనా పాలకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకలూ సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధనౌక.. రహస్య సాధనాల ద్వారా వీటితో కమ్యూనికేషన్‌ సాగించింది. ఇతర దేశాల యుద్ధనౌకలూ తమ కదలికలను మన నౌకకు తెలియజేశాయి. ఈ ఆపరేషన్‌ మొత్తాన్నీ భారత్‌ గోప్యంగా సాగించింది. మలాక్కా జలసంధి నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా యుద్ధనౌకల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించేందుకు జలాంతర నౌకలు, మానవరహిత వ్యవస్థలు, ఇతర సెన్సర్లను తక్షణం సమకూర్చుకోవాలని ఇండియన్ నేవీ ప్రయత్నాలు చేస్తోంది.

అండమాన్‌కు సమీపంలోని మలక్కా జలసంధి వద్ద కూడా భారీగా యుద్ధనౌకలను భారత్‌ మోహరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నేవీ ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. వీటి కదలికలను కట్టడి చేయడానికే ఇండియన్ నేవీ నౌకల్ని మోహరించినట్లు తెలుస్తోంది. చైనా వాణిజ్య నౌకలు కూడా ఎక్కువగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. తూర్పు, పశ్చిమ తీరాల్లో శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టే సామర్థ్యం మన నౌకా దళానికి ఉందని అధికారులు చెబుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: