బావని టార్గెట్ చేసిన బామ్మర్ది...వర్కౌట్ అవుతుందా?

M N Amaleswara rao
శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంని టార్గెట్ చేసుకుని టీడీపీ నేత కూన రవికుమార్ తెలివిగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ మీద దూకుడుగా వెళుతున్న బావ తమ్మినేనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బామ్మర్ది కూన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ్మినేని, కూనలు బావబామ్మర్దులన్న సంగతి తెలిసిందే. కూన సొంత అక్కనే తమ్మినేని వివాహం చేసుకున్నారు. అలాగే తమ్మినేని సొంత అక్క కూన తల్లి. అంటే తమ్మినేని, కూనకు మేనమామ కూడా అవుతారు.

అయితే తమ్మినేని వెనుక ఉండి రాజకీయం నేర్చుకున్న కూన టీడీపీలో నిదానంగా ఎదుగుతూ వచ్చారు. తమ్మినేని ప్రజారాజ్యం, వైసీపీల్లోకి వెళితే, కూన టీడీపీలోనే కొనసాగారు. ఆమదాలవలస నుంచి 2014 ఎన్నికల్లో కూన టీడీపీ తరుపున పోటీ చేసి, వైసీపీ నుంచి పోటీ చేసిన తమ్మినేనిపై విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కూనపై తమ్మినేని గెలిచి, జగన్ ప్రభుత్వంలో స్పీకర్ చైర్‌లో కూర్చున్నారు. స్పీకర్‌గా అసెంబ్లీలో టీడీపీకి చుక్కలు చూపిస్తున్న తమ్మినేని, బయట ఏమో వైసీపీ ఎమ్మెల్యేగా చంద్రబాబుని ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఇలా టీడీపీకి చుక్కలు చూపిస్తున్న తమ్మినేనికి చెక్ పెట్టడానికి కూన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం.. అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి సోమేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు చేశారని ప్రజలు మాట్లాడుతున్నారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు.

అలాగే దీనికి సంబంధించి కొన్ని ఆడియో క్లిప్స్‌ని కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో తెలియదుగానీ కూన మాత్రం, తన బావని టార్గెట్ చేసి ఆమదాలవలసలో పైచేయి సాధించాలని చూస్తున్నారని అర్ధమవుతుంది. ఇక ఈ ఆరోపణలపై స్పీకర్ స్పందించి బామ్మర్దికి ఎలాంటి కౌంటర్లు ఇస్తారనేది, కూన వేసిన రాజకీయ అస్త్రం ఎలా వర్కౌట్ అవుతుందనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: