మరోసారి వార్తల్లోకి ఆస్ట్రేలియన్ బౌలర్ !
ఆస్ట్రేలియన్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఐపీఎల్-2020 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఈ ఆల్రౌండర్ తొలి మ్యాచ్లో రాణించలేకపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. ముంబయి ఇండియన్స్ భారీ స్కోర్ సాధించడానికి పరోక్షంగా కారకుడయ్యాడు. కోల్కత నైట్ రైడర్స్ బౌలింగ్ విభాగానికి బ్యాక్ బోన్గా భావించే ప్యాట్ కమ్మిన్స్.. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో కనీసం తన నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడంటే.. అతని ఫెయిల్యూర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ ప్యాట్ కమ్మిన్స్ను 15.5 కోట్ల రూపాయలను పెట్టి కొనుగోలు చేసింది. అయినప్పటికీ.. ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు ఓవర్లు మాత్రమే వేసిన పాట్.. ఏకంగా 49 పరుగులను సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా అతని ఖాతాలో పడలేదు. అతని బౌలింగ్లో కసి కనిపించలేదు. లైన్ అండ్ లెంగ్త్ తప్పిపోయాడు. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. తప్పుల మీద తప్పులు చేశాడు. ఓ సాధారణ బౌలర్లా మారిపోయాడు. బంతి ఎక్కడ? ఎలా వేయాలనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లుగా సాగింది అతని బౌలింగ్.
పాట్ కమ్మిన్స్ నాసిరకం ప్రదర్శనకు కారణాలు లేకపోలేదు. క్వారంటైన్ నుంచి నేరుగా మ్యాచ్ ఆడాడు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న ప్యాట్.. చివరి నిమిషంలో టీమ్లో చేరాడు. ఫైనల్ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. దీంతో పెద్దగా ప్రాక్టీస్ అనేది లేకుండా నేరుగా మ్యాచ్లో దిగాడు. ప్రభావాన్ని చూపలేకపోయాడు. కమ్మిన్స్ వైఫల్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ ఏ మాత్రం తప్పు పట్టట్లేదు. కమ్మిన్స్ వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో సందేహాలు అక్కర్లేదని, అతని స్థాయికి తగినట్టుగా ఆడతాడనీ నమ్మకముంచాడు.