కొల్గెట్ కంపెనీ పేస్ట్ కు ఎంత పెద్ద డిమాండ్ ఉందో అందరికి తెలిసిందే.. చాలా వరకు జనాలు ఈ పేస్టును వాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు.దాంతో పేస్ట్ ధర ఎంత ఉన్నా కూడా కొంటారు. కోల్గేట్ సంస్థ పేస్టును అధిక ధరకు విక్రయిస్తున్నారని చెప్పి ఓ వినియోగదారుడు పిటిషన్ వేయగా విచారించిన వినియోగదారుల ఫోరం రూ.65 వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తోందని సంగారెడ్డికి చెందిన ఓ న్యాయవాది వేసిన పిటిషన్ను విచారించి శుక్రవారం ఫోరం తీర్పునిచ్చింది.
న్యాయవాదిగా పనిచేస్తున్న సీహెచ్ నాగేందర్ 2019 ఏప్రిల్ 7వ తేదీన సంగారెడ్డిలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ.92కు కొన్నారు. దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్పేస్ట్ రూ.10కి కొనుగోలు చేశారు. అయితే .పదికి 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్కు రూ.92 తీసుకోవడంపై నాగేందర్ సందేహం వ్యక్తం చేశారు. అంటే రూ.17 అధికంగా తీసుకుంటున్నారని గుర్తించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారంటూ ఆయన కొల్గేట్ కంపెనీకి నోటీసులు పంపారు.
అతని నోటీసులకు ఆ కంపెనీ స్పందించలేదు.. దీంతో ఆయన సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. అతడి పిటిషన్ను విచారించి కోల్గేట్ సంస్థ అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు ఇచ్చారు. దాంతోపాటు ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ. 5వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థను ఆదేశించారు.. నెల రోజుల్లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై ఆ సంస్థ ఎలా స్పందిస్తుంది చూడాలి...