జగన్ సర్కారుకి భంగపాటు తప్పదా..?
ఎన్నికల విషయంలో అంతా తన ఇష్టం వచ్చినట్టు చేస్తానని, తాను చెప్పిందే రాజ్యాంగమని నిమ్మగడ్డ అనుకుంటే కుదరదని కొడాలి నాని అన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అలా కాకుండా తానే నిర్వహిస్తానని ఎన్నికల సంఘం అనుకుంటే జరిగే పని కాదన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఎవరూ వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని నాని స్పష్టం చేశారు.
మంత్రుల మాటే సీఎం జగన్ మాట. అంటే జగన్ కి కూడా ఎన్నికలను ఇప్పుడల్లా జరపడం ఇష్టంలేదు. అందులోనూ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. అందుకే మంత్రులతో అలా చెప్పించారు. అయితే నిమ్మగడ్డ మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. కోర్టుల జోక్యంతో తాను ఎలా తిరిగి పదవిలోకి వచ్చారో.. అలాగే కోర్టుల జోక్యంతోనే తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల హైకోర్టు జోక్యంతో ఎన్నికల కమిషన్ కు రావాల్సిన నిధుల్ని ప్రభుత్వం నుంచి వసూలు చేసిన నిమ్మగడ్డ, మరోసారి ఎన్నికల విషయంలో కోర్టుని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, ఎన్నికలు జరుపుకోవాలని కోర్టు తీర్పునిస్తే.. జగన్ సర్కారుకు మరో ఎదురు దెబ్బ తగిలినట్టవుతుంది. ఎన్నికల ఫలితాల విషయం పక్కనపెడితే.. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది.