కోలుకున్నాం కదా అని.. నిర్లక్ష్యం చేయకండి..!

NAGARJUNA NAKKA
కరోనా వైరస్‌ సోకి చికిత్స పొందిన కొద్దిరోజులకే నెగెటివ్‌ వస్తే.. అంతా తగ్గిపోయిందని రోడ్ల మీద తిరిగేస్తున్నారా? అలసటగా ఉంటోందా? అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయా? అయితే పోస్ట్ కరోనా సమస్యలు మొదలైనట్లే అంటున్నారు డాక్టర్లు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకే గాంధీ ఆస్పత్రిలో త్వరలో పోస్ట్ కరోనా వార్డును ఏర్పాటు చేయబోతున్నారు.

కోవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో సంతోషం మిగలడం లేదు. ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కోవిడ్‌ విజేతలుగా అభినందనలు అందుకున్న కొద్ది రోజుల్లోనే కొత్త కొత్త సమస్యలతో తిరిగి ఆస్పతులకు వెళ్లాల్సి వస్తోంది. ఇది కోలుకున్న అందరి సమస్యా కాకపోయినా.. తీవ్రమైనదే. కొవిడ్ పాజిటివ్ వచ్చాక కేవలం వారంలోనే నెగటివ్ వచ్చిందని  చాలా మంది చెబుతుంటారు. అలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే. నెగటివ్‌ వచ్చిన కొందరిలో ఒళ్ళు నొప్పులు అలాగే ఉంటున్నాయి. కొందరు ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా నీరసంగా, అలసటగా ఉంటోందని అంటున్నారు. అలాంటి వారిలో కరోనా అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.

వయోధికుల్లో లక్షణాలు కనిపించకపోయినా పాజిటివ్‌ వచ్చి.. చికిత్స తర్వాత నెగటివ్‌ వచ్చినా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే కనిపించకుండానే వారి శరీరంలోని అవయవాల్ని నాశనం చేస్తోంది.. కరోనా. కాళ్ళు, చేతుల్లో రక్తం గడ్డకట్టడం, లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ తగ్గకుండా అలాగే ఉండిపోవడం, కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయంటున్నారు నిపుణులు.

కరోనా వచ్చి కోలుకున్న వారిలో సగానికన్నా ఎక్కువ మంది చిన్నదో, పెద్దదో.. ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినట్లు చెప్పారు. సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో 23 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వారూ ఉన్నారు. చాలా మందిలో ఆయాసం, విపరీతమైన ఆలసట, శ్వాస కష్టంగా మారడం, ఎక్కువ దూరం నడవలేక పోవడం, లేచి నడవలేక పోవడం, కాళ్లు, కీళ్లు, మెడ, భుజం నొప్పులు కనిపించాయి. కోలుకున్నాక వారం నుంచి నెల రోజులు ఇలాంటి కొత్త సమస్యలు వచ్చినట్లు చెప్తున్నారు. కొందరు ప్రధానంగా శ్వాసకోశ ఇబ్బందులు, కాళ్లలో రక్తం గడ్డ కట్టడం, విరోచనాలతో చికిత్సకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకే.. కరోనా వచ్చి తగ్గాక లైట్ తీసు కోవద్దు అంటున్నారు డాక్టర్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: