మెడికల్ కాలేజీల విషయంలో జగన్ సర్కార్ రికార్డ్..
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలనేదే జగన్ ప్రభుత్వం సంకల్పం అని అన్నారు మంత్రి ఆళ్లనాని. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడుతోందని, మరో 11 మెడికల్ కళాశాలలను ఆధునికీకరించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 9,700 పోస్టులు భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, త్వరలో మరో 1,900 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీలో అదనంగా పలు వ్యాధులను చేర్చింది. పలు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ల పనితీరు మదింపు చేస్తోంది. ఆ వివరాలను సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక వైద్యం తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో కూడా నగదు సాయం చేస్తూ పేదలకు అండగా నిలబడుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాడు-నేడు పేరుతో వసతులు మెరుగు పరిచేందుకు కృషిచేస్తున్నారు అధికారులు. ఇక కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే.. దేశంలోనే ఏపీ మెడికల్ హబ్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు మంత్రులు.