గ్రేటర్ యుద్ధం: ఆ పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరు

N.ANJI
మూసారాంబాగ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తీగల సునరితరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. శుక్రవారం ఎన్నికల డివిజన్‌ ఇంచార్జి దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, సునరితరెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని బస్తీలు, కాలనీల్లోని ప్రతీ గడప గడపను తట్టి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. పాదయాత్రలు, గ్రూప్‌ మీటింగ్‌లతో ప్రజలను కలుస్తున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మేనిఫెస్టో పట్ల ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఎన్నో ప్రజాహిత సంక్షేమ పథకాలు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన టీఆర్‌ఎస్‌ కు అన్ని వర్గాల ప్రజలు బాసటగా నిలుస్తున్నారన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి తీగల సునరితరెడ్డి మాట్లాడుతూ... అభివృద్ధే ఎజెండాతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. మూసారాంబాగ్‌ గడ్డపై గులాబీ జెండా మరోసారి రెపరెపలాడటం తథ్యమన్నారు. ప్రచారంలో డివిజన్‌ అధ్యక్షుడు  చెల్లూరి రఘునందన్‌రెడ్డి, అజీత్‌రెడ్డి, వంగాల ప్రవీణ్‌రెడ్డి, గంట సుదర్శన్, అంబారి పవన్, నర్సింహ్మరెడ్డి, శశిధర్‌రావు ముత్యాల కిరణ్‌ తదితరులున్నారు.

మూసారంబాగ్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని, బీసీల ఓట్లు బీసీలకే వేయాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపు నిచ్చారు. సలీంనగర్‌లోని రజకసంఘం భవనంలో 56 కుల సంఘాలు, 12 బీసీ సంఘాల నాయకులు కాంగ్రెస్‌ అభ్యర్థి చేకోలేకర్‌ సదాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బీసీల ప్రాతినిధ్యం పెంచుకోవడానికి సబ్బండ వర్గాలు బీసీ అభ్యర్థులకు మద్దతుగా నిలబడాలన్నారు. ఇతర కులాలకు వ్యతిరేకం కాదని, బీసీలను రాజకీయంగా ఐక్యం చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సదాలక్ష్మి చేయి గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. రాజ్యాధికారం కోసం బహుజనులు ఏకం కావాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: