ఏఐసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు..!

NAGARJUNA NAKKA
రెబల్స్ తో అధినేత్రి సోనియా సమావేశంతో పార్టీలో సయోధ్య దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సోనియా గాంధీ రిటైర్ కానున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ముమ్మాటికీ ససేమిరా అంటున్నారు రాహుల్ గాంధీ. అశోక్ గెహ్లాట్ కు ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కోశాధికారి బాధ్యతలు కమలనాథ్ కు అప్పగిస్తారని సమాచారం.  ప్రస్తుతం వ్యవహరిస్తున్న తరహాలో కాకుండా పార్టీ లో అన్ని స్థాయిల్లోని పదవులకు ప్రజాస్వామ్యబధ్దంగా ఎన్నికలు జరగాలన్నది రెబల్స్ ప్రధాన డిమాండ్. ఇవాల్టి నుంచి పదిరోజులపాటు వరుసగా ఈ సమాలోచనలు జరగనున్నాయి.

పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించరాదన్న ప్రభుత్వ వైఖరిపైన, ఎన్నికలు జరగబోయే అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పొత్తుల ఖరారు అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి బాధ్యతలను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ చూసుకోనున్నారు.

అసమ్మతి నేతలతో భేటీ జరగడానికి కమల్‌నాథ్ ప్రధాన కారణం. ఆయనే చొరవతీసుకుని ఈ భేటీ జరిగేలా చూస్తున్నారు. అయితే రాహుల్‌కు పార్టీ పగ్గాలు తిరిగి అప్పగించడానికి ఓ ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలోనే 23 మంది సీనియర్లు సోనియాకు లేఖాస్త్రం సంధించారు. పైలట్‌‌ను బుజ్జగించి, మనసు మార్చడంలో కీలకపాత్ర పోషించిన ప్రియాంక, రాహుల్‌.... సీనియర్లకు చెక్‌ పెట్టడంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అయితే ఆజాద్‌ సహా మరో ముగ్గురు సీనియర్లు ప్రతివ్యూహాన్ని రచించి రాష్ట్రాలు, ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెస్‌ నేతలను కూడగట్టి లేఖను రాశారు.

కాంగ్రెస్ కు ఎంతో కీలకమైన మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలను కోల్పోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను సాధించకపోవడంపైనా ఉన్నత స్థాయి నేతలు అసమ్మతి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ముగిసింది.. అంటూ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: