పోతుల వర్సెస్ కరణం.. చీరాలను భ్రష్టు పట్టిస్తున్నారే..!
ఇక, కరణం బలరాం.. వైసీపీలోకి రావడంతో ఇప్పటికే ఉన్న ఆమంచి వర్గంతో నిత్యం .. ఆయన ఘర్షణలకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక, ఇటీవల కాలంలో టీడీపీ నుంచి జంప్ చేసిన పోతుల సునీతకు, కరణంకు మధ్య కూడా వివాదాలు విభేదాలు కొనసాగుతుండడం, అవి వీధి పోరాటాలుగా మారుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా చీరాల రాజకీయాల్లో తాను కూడా చక్రం తిప్పాలని పోతుల సునీత పడుతోన్న ఆరాటం ఇక్కడ కొత్త రాజకీయ యుద్ధానికి తెరలేపింది. కొద్ది రోజులుగా పోతుల సునీత, సిట్టింగ్ ఎమ్మెల్యే కరణంల మధ్య వివాదం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా బహిరంగ వేదికపైనే ఈ ఇద్దరు వివాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దూషించుకున్నారు.
అయితే.. ఈ పరిణామాలు మాత్రం రాజకీయంగా వివాదమే కాకుండా.. స్థానికంగా ఉన్న ప్రశాంతతను కూడా భగ్నం చేసిందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన వృత్తులుఉన్న వారు ఉన్నా.. చీరాలలో ఎప్పుడూ ప్రశాంతత కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ.. రాజకీయాల వివాదాలు తెరమీదికి రాలేదు. ఆధిపత్య రాజకీయాలు చోటు చేసుకోలేదు. కానీ, కరణం బలరాం, పోతుల సునీతలు.. వైసీపీలోకి చేరిన తర్వాత... ఇక్కడి ప్రజలు దినదినగండంగా రోజులు గడుపుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
తాజాగా వేటపాలెం మండలంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఇరువురు నాయకులు దాదాపు కొట్టుకున్నంత పని చేసుకున్నారు. ఆలూ లేదు చూలు లేదు కాని వచ్చే ఎన్నికల్లో సీటు కోసం అంటూ జరిగిన గందరగోళంలో సునీత, బలరాం పరస్పరం మాటలు విసురుకున్నారు. చివరకు బలరాం సునీత చేయితోయాల్సి రావడంతో పాటు కూర్చోవమ్మా అని గద్దించారు. దీంతో ఒక్కసారిగా తలెత్తిన ఈ ఉద్రిక్తతలతో ప్రజలు భయం గుప్పిట్లో చిక్కుకున్నట్టయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో .. అని గుండెలు పట్టుకున్నారు. ఈ నేతలు ఎంత తొందరగా..ఇక్కడ నుంచి పోతారా ? అని స్థానికులు ఎదురు చూడడాన్ని బట్టి.. వీరివల్ల నియోజకవర్గం ఎంత భ్రష్టు పడుతోందని ప్రజలు భావిస్తున్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.