కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!
2020లో బీజేపీ పగ్గాలు చేపట్టారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నాయకత్వ మార్పుతో కాషాయ దళానికి కొత్త ఊపు వచ్చినట్లైంది. సీఎం కేసీఆర్ సొంత గడ్డ దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించింది బీజేపీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15,131 ఓట్లతో 9.82 శాతంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఉప ఎన్నికల్లో మాత్రం 38.47 ఓట్లను దక్కించుకున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపింది. హిందుత్వం ఎజెండాగా సాగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించింది. 2016లో గ్రేటర్హైదరాబాద్ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి 10.34 శాతం ఓట్లు సాధించిన కమలం పువ్వు.. ఈసారి మాత్రం అధికార పార్టీకి చెమటలు పట్టిస్తూ.. 48 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 35.55 శాతం ఓట్లు రాబట్టుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలతో బీజేపీ ఒక్కసారిగా రాష్ట్రంలో రెండో స్థానంలోకి వచ్చింది.
వరుస విజయాలతో దూకుడు పెంచిన బీజేపీలోకి ఈ ఏడాది వలసలు భారీగా జరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్నేతలు బీజేపీ గూటికి చేరారు. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్ స్వామిగౌడ్తో పాటు పలువురు జిల్లాల నేతలు కాషాయం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కూడా దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితే. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి నేతలు బీజేపీలో చేరారు. ఇంకా పార్టీలోకి వచ్చేవారు ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కాషాయదళంలో చేరే అవకాశాలున్నాయి.దీంతో అందరిని ఆందోళనకు గురి చేసిన 2020 సంవత్సరం తెలంగాణ కమలనాధులకు మాత్రం స్వీట్ మెమెరీస్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.