రాజుగారికి అదిరిపోయే షాక్...వైసీపీకి డ్యామేజ్ తప్పదా?

M N Amaleswara rao
ఏపీలో రామతీర్ధం ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసానికి కారణం మీరంటే మీరు అని వైసీపీ-టీడీపీ నేతలు వాదించుకుంటున్నారు. పైగా తాజాగా రామతీర్ధానికి ఒకేరోజు చంద్రబాబు, విజయసాయిలు పర్యటించడం రాజకీయ వేడిని పుట్టించింది. పైగా అక్కడ విజయసాయి కొందరు టీడీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్ళతో దాడి చేయడం చర్చనీయాంశమైంది.

ఇక వీరి రగడ ఇలా జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. రామతీర్ధం ఆలయానికి ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుని తప్పించింది. దీంతో పాటు రెండు ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి రాజుగారిని తప్పించింది. రాముడి విగ్రహం ధ్వంసం అయితే కాపాడలేని వ్యక్తి ఛైర్మన్‌గా ఎందుకు అంటూ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడి, రాజుగారిని పదవి నుంచి తప్పించినట్లు చెప్పారు. అలాగే మంత్రి కాస్త పరుష పదజాలం వాడి రాజుగారిని దూషించడం కూడా చేశారు.

అయితే ఇక్కడ రాజుగారికి షాక్ ఇచ్చినా, మంత్రి మాట్లాడిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉందనే వాదన ఎక్కువగా వస్తుంది. రాష్ట్రంలో అశోక్ గజపతి వ్యక్తిత్వం, ఆయన కుటుంబం గురించి అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని వెదవ అనడం అభ్యంతరకరమని టీడీపీతో సహ న్యూట్రల్‌గా ఉండే వ్యక్తులు చెబుతున్నారు. పదవి నుంచి తొలగించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ అలా అనడమే తప్పు అని మాట్లాడుతున్నారు.

పైగా ఈ విషయంలో రాజులంతా ఒకటి అయ్యేలా కనిపిస్తున్నారు. వారు వైసీపీకి వ్యతిరేకమైతే ఇబ్బందే అవుతుందని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. అయితే రామతీర్ధం ఘటన ముందు రాష్ట్రంలో పలు ఆలయాలపై దాడులు జరిగాయి. అలాగే మంత్రి వెల్లంపల్లి ఉండే విజయవాడలో అమ్మవారి గుడిలో సింహాలు మాయమయ్యాయి. ఇక ఈ ఘటనల్లో ఆలయ ఛైర్మన్‌లని తొలగించడం గానీ, ఎవరినైనా అరెస్ట్ చేసిన సందర్భం గానీ కనబడటం లేదు. మరి దీని బట్టి చూస్తే రాజుగారిపై వేటు వేసి, ఆయన్ని దూషించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: