తల తెగిన రాముడి విగ్రహాన్ని ఏం చేస్తారంటే..?

Deekshitha Reddy
విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్నరామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి జరిగిన అపచారం తెలిసిందే. విగ్రహం తల భాగాన్ని విడగొట్టి.. ముక్కలుగా చేసి కోనేరులో పడేశారు దుండగులు. ఈ దుశ్చర్యపై పోలీసు విచారణ జరుగుతోంది, మరోవైపు రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఈ విగ్రహాన్ని ఇప్పుడేంచేశారు, ఎక్కడ ఉంచారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. విగ్రహాన్ని ఎక్కడ, ఎలా విసర్జనం చేయాలనే విషయంపై పండితులతో చర్చించారు మంత్రులు, అధికారులు.

రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన మంత్రులు దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో సమావేశమయ్యారు. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయ పునర్నిర్మాణం చేపట్టాలని వేద పండితులు మంత్రులకు సూచించారు. ముందుగా బాలాలయాన్ని కట్టాలని తెలిపారు. ధ్వంసమైన విగ్రహాన్ని సముద్రతీరాన నదీసంగమంలో నిమజ్జనం చేయాలని, అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. పాత విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత కొత్త ఆలయ రూపు రేఖలు, నిర్మాణంపై తొలి అడుగు పడాలని చెప్పారు అర్చక స్వాములు.

అర్చక స్వాముల సూచన ప్రకారం రామతీర్థం కొండపై కొత్తగా మరో రాముడి విగ్రహం తయారుచేయించి పునః ప్రతిష్ట చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు పేర్కొన్నారు. మంచి ముహూర్తం చూసి జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తామని తెలిపారు. ఇందుకోసం ముగ్గురు పండితులతో కమిటీ వేశామన్నారు. కమిటీ సూచనల మేరకు పనులు మొదలవుతాయని చెప్పారు.

కొత్తగా నిర్మించే ఆలయాన్ని మరింత పెద్దదిగా ఏర్పాటు చేయాలనేది అర్చక స్వాముల ఆకాంక్ష. గతంలో ఈ ఆలయం చిన్నదిగా ఉండేదని, అయినా భక్తులు ఎక్కువగా వచ్చేవారని, భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని వారు అధికారులకు సూచించారు.

మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసం కేసులో ఇప్పటివరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. దర్యాప్తు కోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు. కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: