వేలల్లో ఖాళీలున్నాయ్.. భర్తీ చేసేది ఎప్పుడో..?

NAGARJUNA NAKKA
తెలంగాణలో యూనివర్సిటీలకు వీసీలే కాదు.. విద్యార్థులకు బోధించేందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేదు. ఉన్నత విద్యను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విద్యార్థి సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్నాయి. యూనివర్సిటీల్లో వేలల్లో వేకెన్సీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఖాళీల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఫ్యాకల్టీ రిటైర్ అవుతున్నా ఖాళీల లిస్ట్ పెరుగుతున్నా కొత్తగా రిక్రూట్‌మెంట్స్ చేపట్టడం లేదు.

తెలంగాణలోని ఏ యూనివర్సిటీలో చూసినా ఫ్యాకల్టీ ఖాళీలే దర్శనమిస్తున్నాయి. యూనివర్సిటీల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ కన్నా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారే ఎక్కువ ఉన్నారు. కొన్ని యూనివర్సిటీల్లోనైతే 20శాతమైనా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. మిగతా 80 శాతంలో కొన్ని ఖాళీగా ఉంటే మరికొన్ని పోస్టుల్లో కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ వాళ్ళు పని చేస్తున్నారు.

పాలమూరు, శాతవాహన, ఐఐఐటీ, తెలుగు యూనివర్సిటీల్లో 20 శాతం కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. ఉస్మానియా యూనివర్సిటీలో 1267 టీచింగ్ పోస్టులు మంజూరైతే 848 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. అంటే మంజూరైన పోస్టుల్లో 67 శాతం ఖాళీగానే ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో 403 పోస్టులుంటే అందులో 295 ఖాళీగానే ఉన్నాయి. అంటే ఏకంగా 73 శాతం ఖాళీలన్నమాట. ఇక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 150 టీచింగ్ పోస్టులకు 115 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 76.7 శాతం పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్‌ వారితో పని కానిచ్చేస్తున్నారు. ఇక పాలమూరు వర్సిటీలో 150 టీచింగ్ పోస్టులకు కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ బోధన సిబ్బంది ఉన్నారు. మిగిలిన 130 పోస్టులు.. అంటే 86 శాతం ఖాళీలున్నాయి

టీచింగ్ ఫ్యాకల్టీని రెండుదశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం వేసిన కమిటీ సిఫారసు చేసింది. నోటిఫికేషన్స్ కోసం అర్హత గల నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. తొందరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని , యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: