అయ్యో..పాపం.. చివరి రోజుల్లో నిమ్మగడ్డ ఆ పని చేయకుండా ఉండాల్సిందా..?
అయితే... చివరి రోజుల్లో నిమ్మగడ్డ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. మార్చిలో పదవి నుంచి దిగిపోయే లోపల ఎలాగైనా ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ పట్టుదలగా ఉండటం ఆయనతో ఇలా చేయించిందేమో.. నిమ్మగడ్డ ఉన్నంతవరకూ ఎన్నికలు పెట్టేది లేదని జగన్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. అయితే జగన్ సర్కారుకు ఉద్యోగులు అండగా నిలిచారు. ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. ఇంతలో కోర్టు కూడా ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసేసింది.
ఇక ఇప్పుడు ఆయన పదవీవిరమణ కూడా ప్రశాంతంగా జరిగేలా లేదు.. ఇప్పటికే నిమ్మగడ్డ అంటే కస్సుమనే వైసీపీ శ్రేణులు ఇప్పుడు మరింతగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆదేశాలు అమలు చేసి.. రాజ్యాంగ పదవిలో ఉండి ఆ పదవికి చేటు తెచ్చిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికైనా నైతిక బాధ్యతతో నిమ్మగడ్డ రాజీనామా చేయాలని మంత్రి కొడాలి నాని వంటి వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో వ్యాక్సినేషన్ క్యార్యక్రమంతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వం చూస్తోందని, త్వరలోనే కోవిడ్ వారియర్స్కి వ్యాక్సిన్ ఇచ్చి తీరుతామని మంత్రి కొడాలి నాని అన్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేయాలని సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, అధికారులు వెళ్లి చెప్పినా పట్టించుకోలేదని, ప్రజలు ఏమైపోయినా తన పదవి అయిపోయే లోపు ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూశారని మండిపడ్డారు. ఇప్పుడు 'హైకోర్టు తీర్పు కుక్క కాటుకు చెప్పు దెబ్బలా, నిమ్మగడ్డ మూతి పళ్లు రాలేలా తీర్పు వచ్చింది' అని మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ ప్రబలి ప్రజలు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని నిమ్మగడ్డ చూశారని మంత్రి ఆరోపించారు. పాపం..నిమ్మగడ్డ చివరి రోజుల్లో ఇలా అభాసుపాలయ్యారన్నమాట.