కేంద్రానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు ఏం జరగబోతోంది?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువడించింది. తదుపతి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఇప్పుడు ఇచ్చిన స్టే కొనసాగుతుందంటూ కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం చెప్పింది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ అన్నారు.

ఇక ఈ చట్టాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. జితేందర్ సింగ్ మాన్ (బీకేయూ అధ్యక్షుడు), డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి (ఇంటర్నేషనల్ పాలసీ హెడ్), అశోక్ గులాటి (అగ్నికల్చరల్ ఎకనామిస్ట్), అనిల్ ధన్వంత్ (శివ్‌కేరి సంఘటన, మహారాష్ట్ర) కమిటీ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు చెప్పింది. 'మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది' అని సీజేఐ చెప్పారు. అయితే రైతులు మాత్రం తమ నిరసనలను కొనసాగించుకునే హక్కు వారికి ఉందని ధర్మాసనం చెప్పింది. మరి సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ నిరసనలను ఆపుతారా లేదా నిరసనలను అదే విధంగా కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

 కాగా.. పంజాబ్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని రైతులు అనేక వారాలుగా ఈ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. భారత్‌తో పాటు అనేక దేశాల నుంచి కూడా రైతులకు మద్దతు లభించింది. ఇతర దేశాధినేతలు వ్యవసాయ చట్టాలపై మాట్లాడటాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యతిరేకించారు. ఇది భారత్ అంతర్గత వ్యవహారమని, ఇందులో బయటి దేశాల ప్రమేయం అవసరం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: