ఖమ్మం కారు పార్టీలో కలకలం
పొంగులేటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపెట మండలం గండుగుల పల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామ నాగేశ్వర్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశం కావడం మరో చర్చ కు తెరలేపింది. స్థానిక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తుమ్మలతో భేటీ అయ్యారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అసలు ఖమ్మం టీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న సస్పెన్స్ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆ మధ్య తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డికి తాను అండగా ఉంటానంటూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం టీఆర్ఎస్ లో నెలకొన్న తాజా పరిణామాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పొంగులేటి వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్ గా స్పందించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.