కమలా హ్యారిస్ ధరించిన పర్పుల్ కలర్ దుస్తుల వెనుక ఆసక్తికర కారణం!
అయితే ఆమె ధరించిన డ్రెస్ గురించి అంతర్జాతీయంగా పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఆ రంగు డ్రెస్ ధరించడం వెనుక గల కారణం విషయానికి వచ్చినట్లయితే... దశాబ్దాల కిందట షిర్లే క్రిషోల్మ్ అనే నల్లజాతీయురాలు అధ్యక్ష పదవికి పోటీ చేశారట. ఆమె మహిళల ఓటు హక్కు కోసం పోరాటం చేశారని, అలాగే కాంగ్రెస్కు ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతి మహిళ మరియు అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి నల్లజాతి మహిళ అయిన షిర్లీ క్రిషోల్మ్ కు గుర్తుగా కమలా ఈ పర్పుల్ కలర్ దుస్తులను ధరించారు. ఆమె తన రాజకీయ జీవితానికి స్ఫూర్తి అని కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచారంలో కూడా పేర్కొన్నారు. అలాగే పర్పుల్ రంగు సాంప్రదాయకంగా అమెరికాలో ద్వైపాక్షికతకు చిహ్నంగా కూడా భావిస్తారు.. డెమొక్రాటిక్ పార్టీ రంగు నీలం, రిపబ్లికన్ పార్టీ రంగు ఎరుపు కాబట్టి ఆ రెండింటి కలయికగా కూడా కొందరు దీని గురించి విశ్లేషిస్తున్నారు. మాజీ ప్రథమ మహిళలు హిల్లరీ క్లింటన్, మిచెల్ ఒబామా కూడా కమలాతో పాటు ఊదా రంగు దుస్తులు ధరించారు. అలాగే దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ముత్యాల హారాలను మెడలో ధరించి కమలాకు మద్దతు తెలిపారు. ఇకపోతే కోవిడ్ కారణంగా భారత్ నుంచి కమలా కుటుంబసభ్యులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయినప్పటికీ కమలా సోదరి మాయ, మేనకోడలు మీనా, అమరా, లీలా, భర్త డగ్ ఎంహాఫ్, అతడి కుమారులు కోల్, ఎల్లా తదితరులు హాజరయ్యారు. కమలా హ్యారిస్ తల్లి భారత సంతతికి చెందినవారు కాగా.. తండ్రి జమైకన్. ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి పెంపకంలోనే పెరిగారు. చదువుల్లో రానించిన కమల.. ఆఫ్రికన్-అమెరికన్ సంతతి విద్యార్థులు ఎక్కువగా చదివే హొవార్డ్ యూనివర్సిటీలో చేరారు. కాలిఫోర్నియోలోని హేస్టింగ్స్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, అక్కడ బ్లాక్ లా స్ట్టూడెంట్స్ అసోసియేషన్కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1990లో కాలిఫోర్నియాలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని వృత్తిని ప్రారంభించారు.