నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్..?
అయితే ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెరైటీగా స్పందించారు. ఇదంతా ప్రజల ఆరోగ్యం కోసం మా ఆరాటం తప్ప వేరే ఏదీ కాదంటున్నారు. ప్రజల కోసం పోరాడిన మాకు ఓటమి కూడా ఆనందమే అంటున్నారు. మా పోరాటం మేం చేశాం.. వ్యవస్థలను గౌరవించాలి కదా అంటూ ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
అంతే కాదు.. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల తపనతోనే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామన్నారు. సమస్య లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసి..సమస్య ఉన్నప్పుడు ఎన్నికలు అంటున్నారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కోర్టు ముందు ఉంచామని తెలిపారు. ప్రజారోగ్యం బాగుండాలన్న తాపత్రయంతోనే ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ను కోరామన్నారు. పరిషత్ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలు ముందుకు తెచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలోనే కుట్ర ఉందని అర్థమవుతుందన్నారు.
ఎన్నికల నిర్వహణలో కుయుక్తులు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్, ఎలక్షన్ ఒక్కసారి జరగలేవని కోర్టుకు చెప్పామన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనగా ఉన్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ వేసుకోకుండానే ఉద్యోగులు ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. మా అభ్యంతరాలను ఎప్పటికప్పుడు ఎస్ఈసీ ముందు పెట్టామని తెలిపారు. ఎస్ఈసీ వినకపోవడంతో కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు.