జగడ్డ: ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖల పర్వం ఆగేలా లేదే...?

VAMSI
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్ట్యా అటు అధికార పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ హోరా హోరీగా జరుగుతోంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు పక్షాల నేతలు హడావిడి చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల తీరును తలపిస్తున్నాయి. పోలింగ్ విషయం పక్కన పెడితే  ఏకగ్రీవాలపైనే అందరి దృష్టి నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణులు తమ జోరు చూపిస్తున్నారు. ఏపీ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశలుగా నిర్ణయించగా  ఇప్పటికే మొదటి రెండు విడతలు పూర్తయ్యాయి. ఈ  రెండు విడతల పంచాయతీ ఎన్నికల  ఫలితాల్లోనూ వైసీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో
గెలుపొందారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగి ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఏయే గ్రామాల్లో తమ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు అన్నది వెల్లడిస్తున్నారు.
 తాజాగా వైసీపీ పార్టీ పై ఎస్ఈసీకి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఫలితాలు ప్రకటించకుండా  వైసీపీ నేతలు అధికారులను బెధిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ లేఖను రాశారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా  ప్రజా తీర్పును తారుమారు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అందుకు పోలీసులు సహకరిస్తున్నారని  ఆరోపించారు.

వైసీపీ మద్దతుదారులు ఓడిపోయిన స్థానాల్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని అధికారులను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జరుగుతున్న ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని స్పందించిన ఈయన..డోన్ డిఎస్సీ నరసింహారెడ్డి, పిప్పలి సిఐ రామలింగం, టౌన్ సిఐ సుబ్రమణ్యం, ఎస్.ఐ మారుతి శంకర్, జలదుర్గం ఎస్ఐ శ్రీధర్, బేతంచర్ల సిఐ కేశవ రెడ్డి, రూరల్ సిఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్.ఐ సురేష్ లపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
పిప్పల్లి, డోన్, జలదుర్గం, బీతంచెర్ల పోలీసు అధికారులపై తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించని కారణంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. వారంతా అక్రమాలకు పాల్పడుతున్నారని ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదన్నారు.

తమ బాధ్యతలను పక్కన పెట్టేసి టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధులపై పోలీసులు టార్గెట్ చేస్తున్నారని.. వేధించే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసేందుకే వైసిపి పోలీసుల సహాయంతో ఇలా చేస్తోందని, అందుకు పోలీస్ అధికారులు సైతం పూనుకోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై విరుచుకుపడుతున్నారని, భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలిచిన ప్రతిపక్ష అభ్యర్ధి సుంకాలమ్మ, ఆమె భర్త సుంకన్నను ఫిబ్రవరి 12న అదుపులోకి తీసుకుని పీప్పలి, జలదుర్గం పోలీసులు బెదిరించారన్నారు. అప్పటికి వారు బెదిరింపులకు లొంగకుండా వారు నామినేషన్ ఉపసంహరించుకోక పోవడంతో వారిని అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని... రోడ్డును ద్వంసం చేశారని ఆర్ అండ్ బీ ఇంజనీర్ తో అక్రమ కేసు పెట్టించారన్నారు.

ఆర్ అండ్ బీకు రూ.8,000 ఫైన్ చెల్లించి, ఇంజనీర్ కేసు వెనక్కు తీసుకున్నా, సుంకాలమ్మ కుమారుడు నరసింహులును కస్టడీలోకి తీసుకుని పోటీల్లో వెనక్కి తగ్గాలని బెదిరిస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వివరించారు. ఇంతటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్న డోన్ పోలీసు అధికారులను వెంటనే బదిలీ చేయండని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఈ అక్రమాలను వెనకుండి నడిపిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇష్ట ప్రకారంగా స్వేచ్ఛగా అభ్యర్థిని ఎన్నుకునేందుకు  అవకాశం కల్పించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: