జగన్, షర్మిల, భారతి పై ఆంధ్రజ్యోతి వార్తల అసలు కథ ఇదే..!?

Chakravarthi Kalyan
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైసీపీకి బద్ద వ్యతిరేకి.. ఈ విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అనుకూలుడు.. అందుకే ఆయన తాను ఆదివారం రాసే కొత్త పలుకులో ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తుంటారు.. ఆయన కొన్ని రోజుల క్రితం జగన్ కూ ఆయన చెల్లి షర్మిలకకూ ఉన్న విబేధాల గురించి రాశారు.. అయితే అప్పట్లో దాన్ని వైసీపీ నేతలు ఖండించారు. కానీ.. చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. అందుకే ఇప్పుడు రాధాకృష్ణ  మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆదివారం కొత్త పలుకులో మరిన్ని కొత్త విషయాలు రాసుకొచ్చారు. జగన్‌కూ.. షర్మిలకూ మధ్య విబేధాలు రావడానికి కారణం జగన్ భార్య భారతీయేనని.. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పట్టించుకోలేదని.. షర్మిల తన కుటుంబ శ్రేయోభిలాషులతో పంచుకున్నారట.


ఆంధ్రజ్యోతి తాజా కథనంపై వైసీపీ స్పందించింది. పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడిన టీడీపీ.. ప్రజల్లో మరింత చులకన అవకుండా దృష్టి మళ్లించడానికే ఏబీఎన్‌ రాధాకృష్ణ, చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు. ఇందులో భాగంగానే రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్క రోజు అయినా గడవకముందే అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు అంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలపై చర్చను పక్కదారి పట్టించడమే వారి లక్ష్యమని, ఈ కుటిల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సజ్జల అంటున్నారు.


సీఎం జగన్, షర్మిల.. ఒకరిపై ఒకరికి అపరిమితమైన ప్రేమ ఉందని సజ్జల తెలిపారు. మహానేత వైఎస్సార్‌ కుటుంబం చాలా పెద్దదని, ఆ కుటుంబంలో అందరూ విశాలమైన భావాలు కలవారని సజ్జల వివరించారు. ఇప్పటికైనా రాధాకృష్ణ చౌకబారు ఆలోచనలు మానుకోవాలని  సూచించారు. ఇలాంటి రాతలు, కథనాల ద్వారా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మేలు చేద్దామని, సీఎం జగన్‌ ఇమేజ్‌ను తగ్గిద్దామని రాధాకృష్ణ భావిస్తే, అది అవివేకమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ రాతల ద్వారా రాధాకృష్ణ నీచమైన, కుచ్చితమైన బుద్ధి బయట పడుతోందన్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలపై, కథనాలపై లీగల్‌గా ముందుకు వెళ్తామని సజ్జల అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: