ఉరితీయబోతోన్న మొదటి మహిళకు క్షమాభిక్ష దొరికేనా..!?
ఈ తరుణంలోనే నిందితురాలు షబ్నమ్ కొడుకు.. ‘డియర్, ప్రెసిడెంట్ అంకుల్ నా తల్లిని ఉరి తీయ్యొద్దు’ అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను అభ్యర్థించాడు. ఇక రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అయితే షబ్నమ్ కొడుకు మహ్మద్ తాజ్ రామ్పుర్ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.
అయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ షబ్నమ్ కేసుకు సంబంధించిన క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించారు. దీంతో ఆమెను ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసిన పవన్ జల్లాదేనే షబ్నమ్ ను ఉరి తీసే అవకాశం ఉందని సమాచారం. ఏడుగురు కుటుంబ సభ్యులను తన ప్రియుడితో కలిసి హత్య చేసింది షబ్నమ్. కుటుంబసభ్యులను అత్యంత పాశవికంగా ఆమె గొడ్డలితో నరికి చంపింది. అప్పటికే మహ్మద్ తాజ్ ఆమె కడుపులో ఉన్నాడు. షబ్నమ్ జైలులోనే బిడ్డకు జన్మనిచ్చింది.
ఇక జైల్ రూల్స్ ప్రకారం ఆరేళ్ల తర్వాత పిల్లాడు కారాగారం పరిసరాల్లో ఉండకూడదు. దీంతో ఆమె స్నేహితుడు ఉస్మాన్ సైఫీకి తన కొడుకును అప్పగించింది షబ్నమ్. నిందితురాలు తన కన్నవాళ్లతో సహా అందరిని హత్య చేస్తే.. కడుపున పుట్టిన బిడ్డ మాత్రం షబ్నమ్ ని కాపాడుకోవడానికి పరితపిస్తున్నాడు. అయితే రాష్ట్రపతి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం వెలువడబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది.