తెలంగాణలో రేపటి నుంచి 6, 7,8 తరగతులు ప్రారంభం...?
కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి అన్న విషయం తెలిసిందే. అయితే అన్లాక్ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటుండగా, తెలంగాణ విద్యా సంస్థలు కూడా పై తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తూ తరగతులు ప్రారంభించారు. అయితే తాజాగా కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 6,7, 8 తరగతులు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.
6,7,8 తరగతుల ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి ఒకటి లోగా తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలలో కోవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
అలాగే పాఠశాల తరగతి గదుల్లో ఎప్పటికప్పుడు శానిటైజర్ చేస్తూ ఉండాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధ్యాపకులు,విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల విద్యార్థుల చదువు పై తీవ్రమైన ప్రభావం చూపింది. అయితే విద్యార్థులు పూర్తిగా నష్టపోకుండా ఈ ఏడాది ఆన్లైన్ క్లాసులు తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ మధ్యనే తొమ్మిది పది తరగతుల వారికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, వారికి మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు 6,7, 8 తరగతుల ను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మరి మిగతా తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ తరగతుల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావాలంటే తల్లిదండ్రులు అనుమతి తప్పనిసరి చేసింది.