ఆ 136 మంది ఇక చనిపోయినట్లే... ప్రకటించిన ఉత్తరాఖండ్ పోలీసులు..
కొందరు మృతదేహాల అవయవాలు మాత్రమే దొరకడం గమనార్హం. తవపోన్ సొరంగంలోనే 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 136 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. ప్రమాదం జరిగి సుమారు 15 రోజులు కావస్తున్నా.. వీరి ఆచూకీ తెలియకపోవడంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది తపోవన్ విద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకున్న సుమారు 16 మందిని కాపాడారు. సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ తోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్థానిక పోలీసులు మొత్తం 1000 మంది వరకు పాల్గొన్నారు. ఈ సహాయక కార్యక్రమాలు రేయిభవళ్లు కొనసాగాయి.
ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్లోని రెయినీ ప్రాంతాన్ని భారీ వరద ముంచెత్తినపుడు.. గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో.. మంచు పర్వతాల్లో దాగివున్న అణ్వస్త్ర పరికరాలు పేలిపోవటం వల్లే ఈ వరద ముంచెత్తిందనే వదంతులు వ్యాపించాయి. నిజానికి.. హిమాలయల్లోని రాష్ట్రం ఉత్తరాఖండ్ను వరదలు ముంచెత్తి, 50 మందికి పైగా మరణానికి కారణమైన వరదలకు మూలం ఒక హిమనీనదం (గ్లేసియర్) నుంచి వేరుపడిన మంచు ఫలకమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.