కేరళ ఎన్నికల్లో అయ్యప్ప శబరిమలపై రాజకీయం..?
కేరళ.. కమ్యూనిస్టుల కోట.. సాధారణంగా కమ్యూనిస్టుల ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు. కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం శబరిమల అయ్యప్ప ఆలయం వివాదం ఓ కీలక అంశంగా మారుతోంది. భక్తుల హక్కుల కోసం మేం కృషి చేస్తామని... దాని కోసం ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకొస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వల విసిరింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలంగా రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వచ్చిన మొదట్లో అన్ని పార్టీలని స్వాగతించాయి.
కానీ ఆ తర్వాత సీన్ మారింది. స్థానిక భక్తుల మనోభావాలు ప్రధానమే అన్న వాదన మొదలైంది. దీంతో విపక్షాలు దీన్ని రాజకీయ అంశంగా మార్చుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా భారీస్థాయిలో జరిగిన నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. శబరిమల భక్తుల హక్కులు కాపాడాతామంటోంది. ఈ రాజకీయ పాచిక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ ఫలించింది కూడా. అందుకే ఇప్పుడు అధికార పక్షమైన ఎల్డీఎఫ్ కూడా వైఖరి మార్చుకుంటోంది.
సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని 20 లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 19 సీట్లు గెలుచుకుంది. కానీ.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఎల్డీఎఫ్ సత్తా చాటింది. అందుకే మళ్లీ బలపడేందుకు శబరిమల అంశమే కీలకం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే శబరిమల అయ్యప్ప భక్తుల చట్టం-2021 తెస్తామని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. కేరళ కాంగ్రెస్ సారథి రమేశ్ చెన్నితల......హిందూ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరి ఈ టెంపుల్ పాలిటిక్స్ పట్ల కేరళ ఓటరు ఎలా స్పందిస్తాడో చూడాలి.