పురపోరు: తునిలో యనమలకు ఇన్ని కష్టాలా ?
ఈ దఫా తునిని జనరల్ మహిళకు కేటాయించగా.. వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 30 వార్డులు ఉండగా... ఇప్పటికే తొమ్మిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక, సమస్యలను తీసుకుంటే.. ప్రధానంగా తుని మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్య.. తాండవ నదికి వచ్చే వరద. ఏళ్ల తరబడి ఈ నదికి వరద రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరువైపులా రిటైనింగ్ నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే... డ్రైనేజీ, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ ల సమస్య కూడా పరిష్కరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.
రాజకీయంగా 2014 ఎన్నికల వరకు కూడా టీడీపీ ఇక్కడ చక్రం తిప్పింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. అన్నీ తానై వ్యవహరించారు. ఇక, ఆ తర్వాత వైసీపీ పుంజుకుంది. ఎవరు వచ్చినా.. సమస్యలు పరిష్కారం కావడం లేదనే వాదన ఉండడం గమనార్హం. అయితే.. ఇప్పుడు పరిస్థితిని మారుస్తామని.. తమకు అవకాశం ఇవ్వాలని ఈ రెండు పార్టీలూ ప్రధానంగా ప్రచారం చేస్తున్నాయి.
మరోవైపు కాపు సామాజిక వర్గం ఎటు ఉంటుందనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అయింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పుంజుకుంది. మరి ఈ ప్రభావం ఉంటుందా? లేక.. అధికార పార్టీకి ప్రజలు జై కొడతారా? లేక.. ప్రతిపక్షాన్ని పుంజుకునేలా చేస్తారా? అనేది చూడాలి. ఏదేమైనా యనమల ఫ్యామిలీ ఇప్పటికే ఇక్కడ మూడు సార్లు ఓడిపోవడంతో ఆయన అనేక కష్టాల మధ్య ఈ ఎన్నికలు ఫేస్ చేస్తున్నారు.