పురపోరు: దేవినేని ముందు గద్దే అస్త్ర సన్యాసం
విజయవాడ.. ఒకప్పుడు బెజవాడ.. పేరు మారినా రాజకీయ ఆధిపత్య పోరు మాత్రం మారలేదు. వ్యక్తుల మధ్య ఆధిపత్యం కోసం జరిగే యుద్ధం ఆగలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్ మధ్య రాజకీయ రణరంగం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే గద్దేపై దేవినేని ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పవచ్చు. అవినాష్ రాజకీయ చాణక్యం ముందు తెలుగుదేశం పార్టీకానీ, గద్దే రామ్మోహన్ కానీ నిలబడలేకపోయారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వారి బలాబలాలు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లే తీరు, గెలిస్తే ఏం చేస్తామో ప్రజల్ని ఒప్పించడంలాంటి విషయాల్లో అవినాష్ ముందంజలో ఉన్నారు. దీనికోసం ఆయన ఒక ప్రత్యేక ప్రణాళిక రచించుకొని వాటిని వైసీపీ తరఫున పోటీచేసే అభ్యర్థులద్వారా అమలుచేయిస్తున్నారు.
లబ్బీపేటలో ముస్లింల కోసం షాదీఖానా నిర్మిస్తానంటూ ఇచ్చిన హామీని వదిలేసిన గద్దే వైఖరినే దేవినేని ఇప్పుడు అస్త్రంగా వాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఇక్కడ షాదీఖానాను నిర్మించలేకపోయారంటూ తాను ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగా ఆ డివిజన్లో అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 15వ డివిజన్ను మోడల్ డివిజన్గా రూపొందిస్తానని రామ్మోహన్ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేదంటే ఇప్పుడేం చేస్తారంటూ ప్రజలు ప్రశ్నించుకునేలా దేవినేని వ్యూహాన్ని రచించారు. ఇప్పుడు అది ఆయా డివిజన్లలో వైరల్గా మారింది. మోడల్ డివిజన్ రూపొందాలంటే వైసీపీ వల్లే సాధ్యపడుతుందనేది నగర ప్రజల్లోకి అవినాష్ స్పష్టంగా తీసుకువెళ్లగలిగారు. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థను వైసీపీ పరం చేయడం కోసం దేవినేని అవినాష్ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేయగలిగారు.