అంబానీ ఇంటి వద్ద బాంబులు.. కేసులో కీలక మలుపు..?
రెండ్రోజుల క్రితం మన్సుఖ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్ ఉంచిన కారు మన్సుఖ్ ఆధీనంలో ఉన్నట్లుగా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో మన్సుఖ్ హత్య సంచలనంగా మారింది. మన్సుఖ్ హత్య కేసులో నిందితులను త్వరగా పట్టుకొని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. మన్సుఖ్ హత్య వెనక ఉన్న కుట్రను ఏటీఎస్ తేటతెల్లం చేస్తుందన్న విశ్వాసం ఉందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధికార ప్రతినిధి సచిన్ సావంత్ అంటున్నారు.
మొన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ కేసు గురించి అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఈ అంశంపైనే అసెంబ్లీలో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మేం ముందునుంచీ చెబుతున్నామని.. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద కథే ఉండొచ్చని ఫడ్నవీస్ అంటున్నారు. తాము చెప్పినప్పుడే పోలీసులు దృష్టి పెట్టి ఉంటే మన్సుఖ్ మరణించేవాడు కాదని విమర్శించారు. దీంతో ఈ కేసును ఏటీఎస్ కు అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఏటీఎస్ రంగ ప్రవేశంతో అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ గా భావిస్తున్న మన్సుఖ్ ఆత్మహత్య గుట్టు వీడే అవకాశం కనిపిస్తోంది. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. అతడు కాలువలోకి దూకి మరణించిన ఉండొచ్చని పోలీసులు భావించారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.