ఆ స్వీడన్ సంస్థ బయటపెట్టిన రిపోర్ట్.. భారత్ పరువు గంగలో కలిపేస్తోంది..?
అయితే.. తాజాగా ఓ స్వీడన్ దేశం సంస్థ ఇచ్చిన ఓ నివేదిక భారత్ పరువు గంగలో కలిపేస్తోంది. ఇంతకీ ఆ సంస్థ ఏమని రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏముంది.. తెలుసుకుందాం.. స్వీడన్కు చెందిన విడెం ఇన్స్టిట్యూట్ ఓ ప్రజాస్వామ్య నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ప్రజాస్వామ్య పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ రూపొందించారట. ఆ నివేదికలో భారత్ స్థాయిని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కాకుండా.. ఎన్నికల ప్రజాస్వామ్య దేశంగా పేర్కొన్నారు.
ఇలా ఇండియా స్థాయి తగ్గించడంతో మన పరువు గంగలో కలుస్తోంది. అమెరికా ప్రభుత్వ నిధులతో పనిచేసే ఈ స్వచ్ఛంద సంస్థ భారత ప్రజాస్వామ్య స్థితిని తగ్గించింది. అందుకు కారణాలు కూడా వివరించింది. 2014 లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి భారత్లో రాజకీయ హక్కులు, పౌర స్వేచ్ఛలకు భంగం కలుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక ఇప్పుడు ఈ నివేదికపై ఇండియాలోనూ రాజకీయం మొదలైంది. ఇలాంటి నివేదిక వస్తే ప్రతిపక్షాలకు పండుగే కదా.
అందుకే భారత్ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదంటూ స్వీడిష్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికకు సంబంధించిన వార్తను కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో భారత్ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదని రాహుల్ కోట్ చేశారు. అయితే ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నివేదిక దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని విమర్శించింది. భారత్లో ప్రజాస్వామ్యం ఘనంగా వర్థిల్లుతోందని చెబుతోంది.