బ్రేకింగ్ న్యూస్ : లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం సీరియస్..ఐసీయూలో చికిత్స
డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ సారథ్యంలోని వైద్య బృందం లాలూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. లాలూ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు పలు పరీక్షలు చేశామని తెలిపారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనలో స్వల్ప న్యుమోనియా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఈ అంశంపై ఎయిమ్స్ నిపుణులను సంప్రదించామని, వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ‘లాలూకి నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో కోవిడ్ నెగెటివ్గా వచ్చింది.. నమూనాలను సేకరించి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్కు పంపాం.. ఫలితాలు శుక్రవారం వస్తాయి’ అని డాక్టర్ ప్రసాద్ తెలిపారు.
వాస్తవానికి పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1990ల్లో లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో 2017 డిసెంబరులో దోషిగా తేలడంతో శిక్ష ఖరారైంది. నాటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా లాలూకు పెరోల్ ఇవ్వాలని ఇటీవల ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ కోరారు. జైల్లో తరచూ ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఇలా జరుగుతున్న క్రమంలోనే లాలూ నిజంగానే తీవ్ర అనారోగ్యానికి గురికావడం గమనార్హం.